ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ విరుచుకుపడ్డారు. యూపీ పోలీసులను బాహాటంగానే హెచ్చరించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో కాన్పూర్ బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్ధీన్ ఒవైసీ తీవ్ర పదజాలంతో పోలీసులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని.. మోదీ, యోగీ వెళ్లిపోయాక మిమ్మల్ని ఎవరు కాపాడాతారంటూ ప్రశ్నించారు.
యూపీలో పాగా వేయాలని భావించిన ఎంఐఎం పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత కాన్పూర్ సభలో పాల్గొన్నారు. ‘మోదీ, యోగీ శాశ్వతంగా పదవుల్లో ఉండరు. వాళ్లు వెళ్లిపోయాక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అప్పుడు అల్లా మీ అంతం చూస్తాడు. ముస్లింలే కచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మీరు ముస్లింలను వేధిస్తున్నారు. మేం వాటిని మర్చిపోయే ప్రసక్తే లేదు’ అంటూ హెచ్చరించారు.
మరోవైపు అసదుద్ధీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఒవైసీ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ‘ ఇలాంటి వ్యాఖ్యలతో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఒవైసీ’ అంటూ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశ్నించారు. అసదుద్ధీన్ ఒవైసీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.