హైదరాబాద్- ఓవైపు తెలంగాణలో ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను చూసి బెంబేలెత్తుతుంటే.. మరోవైపు హైదరాబాద్ ప్రజలని ఓ వింత వ్యాధి కలవరపెడుతుంది. మన ఇళ్ల పరిసరాల్లో ఉండే అతి చిన్న పురుగు ద్వారా ఈ వ్యాధి వాపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలకే ఈ వింత వ్యాధి సోకుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత వ్యాధిని స్క్రబ్ టైఫస్గా నిర్ధారించారు నిపుణులు. ప్రస్తుతం ఈ వింత వ్యాధి సోకిన 15 మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
డిసెంబర్ ప్రారంభంలో ఈ స్క్రబ్ టైఫ్ వ్యాధి వెలుగు చూసింది. మొదట ఈ వ్యాధి సోకిన నలుగురు చిన్నారులను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం వీరిలో ఇద్దరు కోలుకున్నారు. మరో ఇద్దరికి ఇంకా వైద్యం అందిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ ఎలా సోకుతుందంటే..
ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లి వంటి చిన్న పురుగులు(లార్వల్ మైట్స్) కుట్టడం ద్వారా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. మన ఇళ్లల్లోనే మంచాల్లోను ఇతర చెక్క సామాన్లతో పాటు..తడి తడిగా ఉండే ప్రాంతాలు ఈ పురుగులకు ఆవాసంగా ఉంటాయి. అచ్చంగా మంచాల్లో ఉండే నల్లుల్లా ఈ పురుగులు ఉంటాయి.
ముఖ్యంగా ఈ పురుగులు రాత్రి సమయాల్లో ఎక్కువగా కుడుతుంటాయి. ఇవి కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరికి..శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలుంటే వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.