హైదరాబాద్- మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నాక, తిరిగి ఢిల్లీ వెళ్తుండగా దుండగులు అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఐతే ఈ కాల్పుల ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని కిథౌర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రెడ్ అండ్ వైట్ జాకెట్లు వేసుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు అసద్ కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఒవైసీ కారు వెనక ఉన్న మరో కారు దుండగుల వైపు దూసుకెళ్లింది. దీంతో కంగారుపడిన నిందితుల్లో ఒకరు పారిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.
తన కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, కారు టైర్ పంక్చర్ కావడంతో మరో కారులో వెళ్లిపోయినట్లు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. తామంతా క్షేమంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఐతే యూపీ ఎన్నికల సమయంలో ఇలా హైదరాబాద్ ఎంపీపై కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ భాయ్పై జరిగిన ఈ దాడి దారుణమని కేటీఆర్ అన్నారు. అసద్ భాయ్ మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం.. ఈ దాడి దారుణం. తీవ్రంగా ఖండించాల్సిన విషయం.. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Glad you are safe Asad bhai
Outrageous & utterly reprehensible; Strongly condemn this act of cowardice https://t.co/LK3GEyjf1s
— KTR (@KTRTRS) February 3, 2022