ముంబయి- ఆనంద్ మహీంద్ర.. భారతీయులకు ఈ పేరు పరిచయం చేయనక్కర్లేదు. దిగ్గజ సంస్థ మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్ర బిజినెస్ లో బిజీగా ఉంటూనే సామాజిక అంశాల పట్ల అలర్ట్ గా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే, టాలెంట్ ను ప్రోత్యహిస్తూ, అసవరం మేరకు సాయం అందిస్తుంటారు ఆనంద్ మహీంద్ర.
తాజాగా ఆనంద్ మహీంద్ర తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ వన్ చాంపియన్ షిప్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ చాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో, మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ పోటీల్లో మహీంద్రాకు చెందిన మహీంద్రా రేసింగ్ కంపెనీ పాల్గొనబోతోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్ కార్లు ఉరుకులు పెట్టబోతున్నాయని, మా చిరకాల స్వప్నం నెరవేరబోతోందని, దీనిని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.. అని ఆనంద్ మహ్రీంద్రా ట్వీట్ చేశారు.
ఈ-రేసింగ్ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ చాంపియన్ షిప్ పోటీలు ఇప్పటివరకు లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ నగరాల్లో జరగ్గా, మొన్నా మధ్యే తొమ్మిదో సీజన్ పోటీలు సౌదీ అరేబియాలోని దిరియాలో జరిగాయి. ఈ క్రమంలో ఈ చాంపియన్షిప్కి త్వరలోనే హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.