చెన్నై- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. న్యాయపోరాటం తరువాత ఎట్టకేలకు జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కూతురు, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఈ మేరకు దీప శుక్రవారం గృహ ప్రవేశం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆమెకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదాలకు దారితీసింది. జయలలితకు చెన్నై పోయస్ గార్డెన్లో సుమారు 100 కోట్లు విలువ చేసే వేద నిలయం పేరున ఇళ్లు ఉంది. జయలలిత చనిపోయే వరకు వేద నిలయంలోనే ఉన్నారు. ఆ ఇంటి నుంచే అధికారిక, రాజకీయ కార్యకలాపాలు నెరిపేవారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జయలలిత మరణం తర్వాత ఆస్తి వివాదం వేద నిలయం చుట్టూనే తిరిగింది.
జయ మరణం తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఎడపాడి పళనిస్వామి వేద నిలయాన్ని జయ స్మారకమండపంగా మార్చాలని నిర్ణయించారు. వారసులం మేముండగా తమ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని జయ అన్న సంతానమైన దీప, దీపక్ కోర్టును ఆశ్రయించారు. క్రింది కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వేద నిలయం జయ స్మారక మండపంగా మారిపోయింది.
ఐతే వివాదం పూర్తిగా సమసిపోయే వరకు సందర్శకులను అనుమతించరాదని కోర్టు నిషేధాజ్ఞలు విధించింది. ఈ నిర్ణయాన్ని దీప, దీపక్ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని, మూడు వారాల్లోగా వేద నిలయాన్ని వారసులకు అప్పగించాలని ఇటీవల తీర్పునిచ్చింది.
ఇంకేముంది జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ ఇరువురికి శుక్రవారం చెన్నై జిల్లా కలెక్టర్ విజయరాణి వేద నిలయం తాళాలను అప్పగించారు. తన మేనత్త ఇంటి తాళాలు స్వీకరించగానే దీప, దీపక్ నేరుగా వేద నిలయం చేరుకున్నారు. ఇల్లంతా కలియతిరగడంతోపాటు రోడ్డు వైపున ఉన్న బాల్కనీలోకి వచ్చి ఆనందంతో పరిసరాల్లోని ప్రజలకు అభివాదం చేశారు. ఎట్టకేలకు జయలలిత ఇంటి వివాదం సమసిపోవడంతో అమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.