అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తోంది. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అమెరికాలో రోజూ లక్షకుపైనే కేసులు వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే కోవిడ్ కేసులు లక్షన్నర నిర్ధారించారు. ఇక రెండు వారాల్లో 18 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసులే అత్యధికం. అయితే పాజిటివ్ వచ్చిన వారి నుంచి కొత్త వేరియంట్ ఎంతమందికి సోకిందనే టెన్షన్ వెంటాడుతోంది.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా కలకలం రేగింది. శ్వేతసౌధంలో కరోనా కేసు వెలుగు చూసినట్లు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం అధ్యక్షుడు జోబైడెన్ తో కలిసి ప్రయాణించిన తన టీమ్ లోని ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు.. కరోనా బారిన పడ్డ సదరు ఉద్యోగి బైడెన్ వద్ద దాదాపు 30 నిమిషాలు ఉన్నారని గుర్తించారు. దీంతో బైడెన్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. రేపు మరోసారి బైడెన్ కు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి : క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని ఘటన! వైరల్ వీడియో
ఇక సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్ అయినప్పటికీ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్షుడు తన రోజువారీ షెడ్యూల్ను కొనసాగిస్తారని వెల్లడించారు. తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో మరింత ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా విధిస్తోంది అమెరికా.