అన్నిసార్లు నేరాలు చెడు ఉద్దేశం, చెడు ఆలోచనలతో జరగకపోవచ్చు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో కూడా జరుగుతాయి. కానీ, ఎలా జరిగినా కూడా అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, కొడుతున్న ఓ అన్నను సొంత తమ్ముడే అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. అన్న మారతాడని తమ్ముడు ఏడాది ఎదురుచూశాడు. కానీ అన్న మారతాడనే నమ్మకం కలగలేదు. ఇంక ఏం చేయాలో తెలియక తల్లిదండ్రుల కోసం తోడబుట్టిన అన్ననే హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. రైల్వేలో గార్డుగా పని చేస్తున్న గొలగాని వరప్రసాద్ భార్య ఉమా మహేశ్వరి, కొడుకులు హర్షత్ యాదవ్(23), పార్ధివ్ యాదవ్ లతో కలిసి అయోధ్యనగర్ మారుతీ టవర్స్ లో నివసిస్తున్నాడు. పెద్దకుమారుడు హర్షత్ నున్నలో బీటెక్ చేస్తున్నాడు. రెండో కుమారుడు డిస్టెన్స్ లో డిగ్రీ చేస్తున్నాడు. చిన్నకుమారుడి విషయంలో వరప్రసాద్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, హర్షత్ విషయంలో మాత్రం తల్లిదండ్రులకు తలనొప్పులు ఉంటూనే ఉంటాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఎప్పుడూ హర్షత్ తల్లిదండ్రులతో గొడవలు పుడుతూనే ఉంటాడు. ఎప్పుడూ కూడా చెప్పిన మాట వినడు. కొన్నాళ్ల తర్వాత అతని చేష్టలు శ్రుతి మించిపోయాయి. తల్లిదండ్రులను కొట్టడం కూడా మొదలు పెట్టాడు. అవన్నీ చూస్తున్న పార్ధివ్ యాదవ్ కు అన్నపై కోపం మొదలైంది. ఎలాగైనా హర్షత్ చెర నుంచి తల్లిదండ్రులను తప్పించాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది క్రితమే అన్నని చంపాలని పార్ధివ్ అనుకున్నాడు. కానీ, అన్న ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఆశతో సంవత్సరకాలం ఎదురు చూశాడు. కానీ, అన్నలో ఎలాంటి మార్పు రాలేదు.
చివరికి అన్న హర్షత్ యాదవ్ ను వదిలించుకోవాలని పార్ధివ్ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సోఫాలో నిద్రపోతున్న అన్నపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీ భాగంలో పొడిచాడు. హర్షత్ యాదవ్ అక్కడికక్కడే మరణించాడు. కత్తిని ఇంట్లోని కబోర్డులో దాచిపెట్టాడు. ఆ సమయంలో ఇంట్లోంచి పెద్దపెద్దగా కేకలు రావడంతో చుట్టుపక్కల వారు పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అది హత్యని నిర్ధారించుకున్న తర్వాత పైఅధికారులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా అన్న చేష్టలు తట్టుకోలేక తమ్ముడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పార్ధివ్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అన్న తల్లిదండ్రులను వేధిస్తున్నాడని తమ్ముడే హత్య చేశాడు. అయితే అన్న మారడు అనుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కౌన్సిలింగ్ ఇప్పించడం లాంటివి చేసుంటే బావుండేది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఉన్న ఇద్దరు పిల్లలు దూరమైపోయారు. పార్ధివ్ చేసిన పని సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.