ఇంకో మూడు గంటల్లో పెళ్లి.. బంధు మిత్రుల మధ్య.. పెద్దల సమక్షంలో అతని వివాహం జరగాల్సి ఉంది. 15 నిమిషాల్లో వస్తానని వెళ్లిన పెళ్లి కొడుకు తిరిగి రాలేదు. అందరూ కంగారుగా ఉన్నారు. కాసేపట్లో వివాహ ముహూర్తం. అందరూ ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఆ వార్త వినగానే వారిపై పిడుగు పడినట్లు అయ్యింది. వారి కుమారుడు ప్రమాదంలో చనిపోయాడని.. మృతదేహం ఆస్పత్రిలో ఉందని తెలియగానే వారు ఒక్కసారిగా కుప్పకూలారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విలపించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్య శ్యామ్యూల్(35) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతనికి వనపర్తికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్ నగర్ కల్వరి చర్చిలో వివాహ ముహూర్తం. పెళ్లి సమయానికి మూడు గంటల ముందు శ్యామ్యూల్ ఇప్పుడే వస్తానంటూ కారు తీసుకుని జడ్చర్ల బయల్దేరాడు. జడ్చర్ల- మహబూబ్ నగర్ 167వ నంబరు జాతీయ రహదారిపై నక్కలబండ తండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును కారు ఢీకొట్టింది.
ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శ్యామ్యూల్ ను బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ రమేష్ బాబు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇంకాసేపట్లో పెళ్లి అనగా కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రుల నోట మాట రాలేదు. ఇంటికి వచ్చిన బంధువులు తీవ్ర విషాదంతో అలాగే ఉండిపోయారు.
ఇదీ చదవండి: శాడిస్ట్ ప్రియుడు.. ప్రియురాలిపై స్నేహితులతో అత్యాచారం
శ్యామ్యూల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి కోసమని తీసుకున్న పూల దండలను పెళ్లి కొడుకు మృతదేహంపై వేశారు. పెళ్లి హడావుడితో ఉండాల్సిన ఇల్లు విషాద ఛాయలతో.. ఆక్రందనలతో మారు మోగింది. తమకు చివరి క్షణాల్లో తోడుగా ఉండాల్సిన కొడుకు ఇలా అర్ధాంతరంగా దూరమవ్వడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ‘శ్యామ్యూల్ లే నాన్న.. నీకు పెళ్లి జరుగుతోందిరా అని ఆ తల్లి రోదిస్తుంటే’.. అందరి కళ్లు చెమ్మగిల్లాయి. గుప్పెడు మట్టి వేసి తమను సాగనంపుతాడనుకున్న కొడుకు.. ఇలా విగతజీవిగా రావడాన్ని చూసి ఆ తండ్రి నోట మాట రాలేదు. శ్యామ్యూల్ మృతితో మహబూబ్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.