కొన్నిసార్లు మంచితనం కూడా శాపంగా మారచ్చు. ఆపదలో ఉన్నారని ఆదుకోవడమే ఆ మహిళకు శాపమైంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలు ప్రాణాలు బలిగొనేలా చేసింది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి అడగడమే తప్పు అయ్యింది. బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. పొందిన సాయాన్ని మర్చిపోయి ఆ దంపతులు చేసిన విష ప్రచారం.. మూడు ప్రాణాలు బలవ్వడానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వీణ(32) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా యదేహళ్లిలో నివాసముండేది. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా జీవిస్తుండేది. జనవరి 13న తన ఏడేళ్ల పాప, ఏడాది వయసున్న మరోపాపతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం జనవరి 14న హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో లభ్యమైంది. ఏడేళ్ల పాప మృతదేహం మరోచోట లభించింది. ఏడాది పాప మృతదేహం ఇంకా దొరకలేదు. ఆమె భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తన భార్య, పిల్లలు మరణించడానికి సంతోష్, అతని భార్య ఆషానే కారణమంటూ ఫిర్యాదు చేశాడు. వాళ్లిద్దరూ తెలిసిన వారు కావడంతో.. వారికి తన భార్య రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును తన భార్య తిరిగి అడినందుకు వారు పుకార్లు మొదలు పెట్టినట్లు చెప్పాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ దంపతులు ప్రచారం చేశారన్నాడు. కొందరు ఆ మాటలు నమ్మి తన భార్య గురించి తప్పుగా మాట్లాడారని తెలిపాడు. ఆ మాటలు విని వీణ ఎంతో మనోవేదనకు గురైందన్నాడు. తాను ఎంత ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా ఆమెను ఓదార్చలేకపోయానన్నాడు. సంక్రాంతికి పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియజేశాడు.
తన భార్య, ఇద్దరు పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన సంతోష్, ఆషాలను కఠినంగా శిక్షించాలంటూ బాధితుడు డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 15న నిందితుడు సంతోష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా ఏడాది వయసున్న పాప మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.