తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కనుమ రోజు కొందరు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్న సమయంలో చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీరని విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేయబడింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీవ్ర కలకలం రేపింది.
గ్రామంలో వస్తున్న అనాధిగా వస్తున్న ఆచారంలో భాగంగా పశువుల పండుగ నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. అయితే పొట్టేలును నరికే వ్యక్తి కాస్త ఎక్కువగానే తాగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఫుల్లుగా తాగి ఉన్న విషయం గ్రామస్తులు గమనించారో లేదో.. లేదా అది కామన్ లే అనుకున్నారో ఏమో కానీ.. బలి ఇచ్చే క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును నరకబోయి.. పొట్టేలును పట్టుకున్న సురేష్ (35) అనే వ్యక్తిని నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది చదవండి : ఊరేగింపులో దేవుడి విగ్రహానికి చెమటలు!
ఇది చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఒక్కక్షణం షాక్ అయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.