ప్రేమ.. పెళ్లి.. నూరేళ్ల జీవితం. ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని నూరేళ్లు హాయిగా జీవించాలనే కలలు కంటారు. ఆ జంట కూడా అలాగే కలలు కని.. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. భవిష్యత్లో ఎన్నో సాధించాలని కలలు కన్నారు. ఎప్పటికైనా వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకుంటారనే ఆశతోనే ముందడుగు వేశారు. పెళ్లైన తర్వాత 50 రోజులకు పెద్దవాళ్లను కలిసేందుకు వెళ్లారు. కన్నతల్లి కాబట్టి కాదనలేక కొడుకును దగ్గరకు తీసుకుంది. కానీ ఏమైందో తెలీదు.. అప్పటివరకు బాగానే ఉన్న దంపతులు ఉరేసుకుని తనువు చాలించారు.
ఇదీ చదవండి: ‘బిగ్ బాస్ 5 తెలుగు’ కొత్త కెప్టన్ గా షణ్ముఖ్ జశ్వంత్..
రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీశ్(29), రంకు దివ్య(20) ప్రేమించుకున్నారు. జీవితంలో ఇంకా సెటిల్ కాకుండానే పెళ్లి చేసుకున్నారు. స్నేహితుల సమక్షంలో అన్నవరం దేవాలయంలో వివాహం చేసుకుని.. విశాఖలో కాపురం పెట్టారు. 50 రోజులు గడిచిపోయాయి. ఆ కోపాలు, తాపాలు అన్నీ సమసిపోయుంటాయిలే ఇకనైనా తమను ఆదరిస్తారనే నమ్మకంతో స్వగ్రామానికి వెళ్లారు. తండ్రిలేని బిడ్డ కావడంతో తల్లి ఓదార్చి ఇంట్లోకి ఆహ్వానించింది. తప్పు చేశానమ్మా అంటూ తల్లిని పట్టుకుని ఏడ్చేశాడు. ఇద్దరూ ఫోన్ వదిలేసి పై అంతస్తుకు వెళ్లారు. ఫోన్ ఇచ్చేందుకు ఒక యువకుడు పెకెళ్లాడు. ఇంట్లో ఇద్దరూ చెరో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించారు. యువకుడు ఒక్కసారి కేకలు వేస్తూ అందరినీ పిలిచాడు. అప్పటికే హరీశ్, దివ్య తనువు చాలించారు.
హరీశ్ ఎంసీఏ పూర్తి చేసి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేందుకు విశాఖలో ఉంటున్నాడు. దివ్య డిగ్రీ ఫైనలియర్ పరీక్షల కోసం వెళ్లి తిరిగిరాలేదు. వీళ్ల ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బంధువుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. పోలీసుల దర్యాప్తులోనే అసలు కారణాలు తెలుస్తాయామో చూడాలి.