తూర్పు గోదావరి జిల్లాలోని వంగలపూడిలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త.. తాను విషం తాగడమే కాకుండా పిల్లలకు కూడా తాగించాడు. ప్రస్తుతం అతనితోపాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన నుంచి మరో బాలుడు, బాలిక తప్పించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో ఉంటుండగా, వీరి పిల్లలు 13, 10 ఏళ్ల ఇద్దరు కుమారులు , 12 ఏళ్ల కుమార్తె.. ముగ్గరూ వంగలపూడిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అయితే.. తండ్రి అప్పుడప్పుడూ వెళ్లి పిల్లల్ని చూసి వస్తుండేవాడు.
ఇది చదవండి : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం.. ఆపై చిత్రహింసలు!
ఈ క్రమంలో భార్యకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పండగ అని చెప్పి పిల్ల దగ్గరకి వచ్చిన తండ్రి , కాసేపు వారితో గడిపి.. ఆ తరువాత తన ముగ్గురు పిల్లలను గ్రామంలో తోటలు ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఎలుకల ముందు తాగాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించేందుకు ప్రయత్నించాడు. పదేళ్ల కుమారుడు మాత్రమే మందు తాగాడు.. చేదుగా ఉండడంతో మరో ఇద్దరు తాగలేదు. కొంతసేపటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న తండ్రి, సోదరుడి దగ్గర కూర్చున్న పిల్లలను చూసిన స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను మెరుగైన చికిత్స కోసం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అయితే.. తన భార్యకు సంబంధించిన అసభ్యకరమైన వీడియో సమీప బంధువుల నుంచి సోషల్ మీడియాలో వచ్చిందని దీంతో తాను మనస్థాపానికి గురై ఇలా చేశానంటూ బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.