కృష్ణా జిల్లా గుడివాడలో ఓ వివాహిత పక్కింటి 15 ఏళ్ల మైనర్ బాలుడిని తీసుకెళ్లిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 19న 15 ఏళ్ల మైనర్ బాలుడు ఇంటి నుంచి కనిపించకుండాపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే ఆ బాలుడి ఇంటి పక్క వివాహిత కూడా కనిపించకుండా పోయిందనే ఫిర్యాదు పోలీసులకు అందింది.
ఇక ఒకే రోజు ఇద్దరు కనిపించకుండాపోవడంతో పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. ఆ మహిళ.. మైనర్ బాలుడికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోయిందా? అసలు డబ్బు కోసం ఇలా చేసిందా? లేక శారీరిక సుఖం కోసం బాలుడిని ట్రాప్ చేసిందా? అసలు ఈ రెండు మిస్సింగ్ కేసులకు సంబంధం లేదా? అనే కోణాల్లో పోలీసులు చాలా రకాలుగా విచారణ జరిపారు. దీంతో.. నిందితురాలు బాలుడికి మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని గుడివాడ టూ టౌన్ సీఐ దుర్గారావు మీడియాకు తెలిపారు.
హైదరాబాద్ నుంచి గుడివాడకు తీసుకొచ్చిన పోలీసులు ఆ బాలుడికి కౌన్స్ లింగ్ ఇచ్చి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన మహిళపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.