Crime News : సైకిల్ రూపంలో ఓ వ్యక్తికి మరణం ఎదురొచ్చింది. అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపి ఇంటికి బయలుదేరిన అతడ్ని మృత్యువు కబళించింది. బైకు-సైకిల్ ఢీకొట్టుకున్న ఘటనలో బైకిస్ట్ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా చిలమత్తూరుకు చెందిన 25 ఏళ్ల విజయ్కృష్ణ పాలసముద్రం దగ్గరలోని కియా అనుబంధ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావటంతో సోదరుడికి పవర్ బ్యాంక్ తీసుకువస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. స్నేహితులతో సరదాగా గడిపి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. బస్సులు లేకపోవటంతో బంధువుల ద్విచక్రవాహనం తీసుకుని ప్రయాణమయ్యాడు. సరిగ్గా లేపాక్షి మండలం నాయనిపల్లె క్రాస్ వద్దకు రాగానే సంజీవరాయప్ప అనే వ్యక్తి సైకిల్, విజయ్కృష్ణ బైక్ను ఢీకొట్టింది.
దీంతో విజయ్ నేలపై పడి ఆపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అతడ్ని 108 వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సంజీవరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తమ కుమారుడి మరణంపై పలు అనుమానాలు ఉన్నాయంటూ విజయ్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడి దగ్గర ఐడెంటిటీ కార్డులు ఉన్నప్పటికి మరణం గురించి పోలీసులు తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.