తిరుపతి- రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి పొలిటీషియన్స్ నోరు జారుతుంటారు. పరిధికి మించి ప్రత్యర్ధులపై పరుష పదజాలం వాడుతుంటారు. రాజకీయాలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషనలకు దిగుతుంటారు కొంత మంది నేతలు. ఇదిగో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని, ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ సీఎం కార్యాలయానికి చేరుతోందని నారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నమని ఆయన చెప్పారు. ఏపీలో వైసీపీ నేతల భూకబ్జాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భూకబ్జాలకు పాల్పడే అధికార పార్టీ నేతలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భూకబ్జాల విషయంలో వైసీపీ నేతలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులందరు ఖచ్చితంగా జైలుకు వెళ్ళే రోజు వస్తుందని నారాయణ హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఈ వ్యవహారంలోకి లాగారు నారాయణ. ఆమెను ఉద్దేసిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని చెప్పిన నారాయణ, అంతటితో ఆగకుండా రాష్ట్రాన్నే కాదు భార్యను కూడా జగన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడేమో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన నారాయణ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా ఆరోపణలు చేసే సమయంలో కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేయడం సరికాదని హితువు పలుకుతున్నారు.