న్యూ ఢిల్లీ- ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది.
ఈ మేరకు ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసిన విధంగానే, ఓటర్ ఐడితో ఆధార్ కార్డ్ లింక్ను అనుమతిస్తారు.
ఐతే ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. అంటే ఓటర్ల ఇష్టానుసారంగా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుకుంది. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వారంతా నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉండేది.
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
అంతే కాకుండా ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చింది మోదీ సర్కార్. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యేవి. ఇదిగో ఇలాంటి కీలక ఎన్నికల సంస్కరణలను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.