పశ్చిమ గోదావరి- సాధారణంగా జైల్లో.. నేరస్తులు, పోలీసులు ఉంటారు. కానీ కోళ్లు ఉండటం.. అది కూడా పది రోజులుగా జైల్లోనే ఉండటం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే చదవండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఇదే దృశ్యం కనిపిస్తోంది. గత పది రోజులుగా కోళ్లు పోలీస్ స్టేషన్ లో ఉండగా.. అధికారులే వాటికి కావాల్సిన తిండి, నీళ్లు పెడుతున్నారు. గత పది రోజులుగా ఇవి జైలులో నే ఉన్నా.. అవి తమవే అంటూ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకు ఇవేమైనా నేరం చేశాయా అంటే ఏం లేదు. అయినా సరే జైళ్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు పోలీసులే ఇప్పుడు పందెం కోళ్లను మేపాల్సిన పరిస్థితి నెలకొంది.. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
సంక్రాతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కోళ్ల పందాలాపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ పందేంరాయుళ్లు వీటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. రాజకీయ నేతల అండతో మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కోడి పందాలా నిర్వహణపై ఆంక్షల నేపథ్యంలో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాములపర్రు, కలుగొట్ల గ్రామాలోని కోళ్ల పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ పట్టుబడ్డ కోళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అలా గత పది రోజులుగా ఈ పందేం కోళ్లు జైల్లోనే ఉంటున్నాయి.
మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో పందెం కోళ్ల ఓనర్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫైన్ కట్టి వాటిని తీసుకెళ్తారు. అయితే ఈ సారి కోళ్ల పందెం నిర్వహిస్తున్నారని తెలిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోళ్లు తమవి అని ఎవరైనా ముందుకు వస్తే కఠిన శిక్షలు తప్పవని భయపడుతున్నారు. కోళ్లను తీసుకెళ్లడం కోసం ఎవరూ రావడం లేదు. ఈ క్రమంలో పోలీసులే వాటి పోషణను చూసుకుంటున్నారు.