మంత్రి సీదిరి అప్పలరాజుకు విశాఖలో ఘోర అవమానం ఎదురయ్యింది. శారద పీఠంలోకి పోలీసులు ఆయనను అనుమతించలేదు. ఆశ్రమంలోకి కేవలం మంత్రికే అనుమతి ఉందని.. అనుచరులకు అనుమతి లేదని ఆయన ముఖం మీదే చెప్పారు. అంతటితో ఆగక బూతులు తిడుతూ మంత్రి ముఖం మీదే గేటు వేశారు. ఈ సంఘటన వివరాలు.. విశాఖ శారద పీఠం వార్షిక మహోత్సవాల సందర్భంగా సీఎం జగన్ బుధవారం శారద పీఠానికి వస్తున్నారు. ఈ క్రమంలో మినిస్టర్ కూడా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు శారద పీఠానికి వెళ్లారు.
సీదిరి అప్పలరాజుతో పాటు అనుచరులు కూడా వచ్చారు. అయితే అక్కడ విధి నిర్వహణలో ఉన్న సీఐ.. మంత్రికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతి ఉందని.. అనుచరులకు లోపలికి అనుమతి లేదని తెలిపాడు. దాంతో మినిస్టర్ తన అనుచరులను కూడా అనుమతించాల్సిందిగా సీఐని అభ్యర్థించాడు. అందుకు అంగీకరించని సీఐ మినిస్టర్ మాత్రమే లోపలికి వెళ్లాలని.. ఈ నిర్ణయం ఆయనకు నచ్చకపోతే.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనడమే కాక మంత్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగక మంత్రి ముఖం మీదే గేటు వేశాడు.
ఈ పరిణామంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సదరు సీఐ క్షమాపణలు చెప్పాలని మంత్రి అనుచరులు డిమాండ్ చేశారు. కానీ సీఐ స్పందించకపోవడంతో సీదిరి అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసుల ప్రవర్తనకు చేతులెత్తి దండం పెట్టి మరీ అక్కడ నుంచి వెళ్లిపోయారు సీదిరి. ఈ సంఘటనపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే దాని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు.