జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగారు ఆందోళనకారులు.చివరకు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఫలితంగా హింసా కాండ చోటు చేసుకుంది. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా మారడానికి వాట్సాప్ మెసేజ్ కారణం కావడంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అన్ని నెట్వర్క్లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
అమలాపురంలో ఓవైపు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకుని, నిరసన చేపట్టాలని కోనసీమ సాధన సమితి పిలుపునిచ్చింది. దీంతో అమలాపురంలో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ను రంగంలోకి దించిన పోలీసు శాఖ.. పట్టణంలో భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Konaseema: భగ్గుమన్న అమలాపురం.. కారణాలు ఏంటి.. ఆందోళకారుల ఏం కోరుతున్నారు!కోనసీమ అంతటా కర్ఫ్యూ కొనసాగుతోంది. నిన్న అగ్ని గుండలా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయట వ్యక్తులను ఎవర్నీ అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. మంగళవారం అల్లర్లకు పాల్పడిన వారిలో కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు. రోడ్లపైకి వచ్చిన ఎవరైనా ఆందోళనకు దిగితే అరెస్టు చేసి కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.