తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమైంది. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభ ప్రసంగం చేశారు. పార్టీ, కార్యకర్తలు, వైసీపీ పాలనను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ప్రభుత్వ పాలనపై మహానాడు వేదికగా చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేతగాని పాలనతో రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ విమర్శించారు. గడిచిన 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న సమస్యలు ఒకెత్తు అయితే.. గడిచిన మూడేళ్లలో తెలుగు దేశం పార్టీ ఎదుర్కొన్న సమస్యలు మరో ఎత్తు అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరని చంద్రబాబు విమర్శించారు. రైతులకు తాము అండగా ఉంటామని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసానిచ్చారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేదం పేరుతో నాసిరకం మద్యాన్ని అధిక ధరకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటోందంటూ దుయ్యబట్టారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఏమయ్యాయని ప్రశ్నించారు.
అటు తెదేపా పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికలపై ఓ క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తెదేపాలో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. పార్టీకి చేసిన సేవలను డాక్యుమెంటేషన్ చేస్తామన్నారు. సరైన వ్యక్తులకు సరైన స్థానం కల్పిస్తామంటూ వ్యాఖ్యానించారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.