పొద్దున్నే వేడివేడిగా పూరీ.. సాయంత్రం కారం కారంగా మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే వచ్చే మజానే వేరు. అనుభవించాల్సిందే కానీ.. ఆ అనుభూతిని వర్ణించలేం. బయట టిఫిన్ చేయాల్సి వస్తే.. చాలా మంది పూరీకే ఓటేస్తారు. పైగా ఇది ఖరీదైన టిఫిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక మిరపకాయ బజ్జీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి. ఈ వార్త చదువుతుండగానే.. మీకు ఓ సారి మిర్చి తినాలనిపిస్తే.. కాస్త ఆగండి. పూర్తిగా చదివాక.. తినాలో వద్దో మీరే నిర్ణయం తీసుకొండి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యి ఇప్పటికి 14 రోజులు అవుతుంది. మనకు సుదూర ప్రాంతంలో ఉన్న ఈ దేశాల్లో ప్రారంభమైన యుద్ధం మనపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. దాని ప్రభావంగా ఆంక్షలు అమలు చేయడంతో.. వంట నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటివరకు కిలో రూ.138 వరకు ఉన్న ప్రముఖ సన్ఫ్లవర్ బ్రాండ్ నూనె ఇప్పుడు రూ.175, అయిదు లీటర్లు రూ.890, 15 లీటర్ల డబ్బా రూ.2,7820 వరకు పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే గడచిన పన్నెండు రోజుల్లో వంట నూనెలపై కిలోకు రూ.37, అయిదు కేజీలపై రూ.170, 15 లీటర్లపై రూ.520 భారం పడింది. దీంతో వీటిని కొనలేక సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరలు తగ్గేవరకు కొందరు వినియోగం సైతం తగ్గించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయ విద్యార్థి! కారణం?
ఇక వంటనూనెల ధరలు ఇంతలా పెరగడంతో.. స్టార్ హోటళ్లు మొదలు.. రోడ్డుపై ఉన్న తోపుడు బళ్ల వరకు అనేక హోటళ్లు టిఫిన్ రేట్లు పెంచేశాయి. దోసె, పూరీపై పది నుంచి పన్నెండు చొప్పున, ఇడ్లీపై అయిదు రూపాయల చొప్పున ధర పెంచేశాయి. నూనె ధరలు పెర గడంతో పెంపు తప్పలేదని బయట బోర్డులు ఏర్పాటు చేశాయి. కొన్ని హోటళ్లయితే ధరలు పెంచడానికి బదులు పూరీ, బజ్జీ వంటి ఎక్కువ నూనె వినియోగించే టిఫిన్ల విక్రయాలు నిలిపివేశాయి. వంట నూనె ధరలు భారీగా పెరగటంతో కాకినాడ సుబ్బయ్య హోటల్ పూరీ అమ్మకాలు నిలిపి వేసింది. దోసెలు కూడా తగ్గించేసింది. కొన్ని రెస్టారెంట్లు చికెన్ స్టార్టర్ల రేట్లు కూడా పెంచి మెనూ ధరలు సవరించాయి. ఇదంతా ఒకెత్తయితే వంటనూనెల ధరలు ఇంకా పెరిగిపోతాయనే భయంతో కొందరు ఎక్కువగా నూనె డబ్బాలు కొంటున్నారు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు బ్లాక్లో అమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి: భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ మహిళ!
ఇక యుద్ధం ప్రభావంతో నేడో, రేపో పెట్రో ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు రవాణా ఖర్చుల భారం పేరుతో నిత్యావసరాలు, పండ్ల ధరలు కూడా మరింత పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారనున్నాయి. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.