గత కొంత కాలంగా ఏపిలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శంకుస్థాపన కార్యక్రమం, విధులకు ఆటంకం కలిగించారని రామతీర్థం ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రెండు సెక్షన్ల కింద (473, 353) కేసులు పెట్టారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించడం.. దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం, ఆస్తులు డ్యామేజ్ చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. అశోక్తో పాటూ మరికొందరిపైనా కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న(డిసెంబర్ 22) రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.
ఇది చదవండి : బిగ్ బాస్ 5 ఫైనల్ రెమ్యూనరేషన్స్ లీక్! ఎవరెవరికి ఎంతంటే..?
తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం, కొబ్బరికాయ కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకోవడంతో అశోక్ గజపతి రాజు అనుచరులు శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగింది. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటన అనంతరం మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణలు ఆశోక్ గజపతి రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.