ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను కొండాపూర్లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వరుసగా.. ప్రశ్నా పత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు టీచర్లను అరెస్ట్ చేయగా.. వారంతా నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నారాయణ అరెస్టు తో ఏపిలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఈ విషయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల టీడీపీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతుందని.. ఇందులో భాగమే నారాయణ అరెస్ట్ అని అన్నారు. ఇక ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేసే సమయంలో చాలా కఠినంగా ఉంటారని.. విచారణ చేసే సమయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తారని అన్నారు. అసలు ఈ కేసు విషయంలో ప్రభుత్వానికే ఒక క్లారిటీ లేదని.. లీకేజ్ విషయంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థకు ఏ సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటే.. లీకేజ్ విషయంలో ఈ రెండు సంస్థలే కారణం అని సీఎం అంటున్నారు. మరి ఇందులో ఏది నమ్మాలి.. ఏది నమ్మోద్దు అన్న విషయం ప్రజలు తేల్చుకోవాలి అన్నారు. నారాయణ అరెస్ట్ ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు.