కరోనా వైరస్కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని.. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఓ వైపు వ్యాక్సినేషన్ వచ్చినప్పటికీ ఆనందయ్య తాను కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టానంటూ ప్రకటించారు.
ఆనందయ్య మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆ మందు విషయంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో కొంత కాలం ఆగిపోయిన.. మొత్తానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వడంతో మందు పంపిణీ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఆనందయ్య మందు కోసం చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే.. దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని ఆనందయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆనందయ్య పార్టీ పెట్టే యేచనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అయిన ఆనందయ్య ఈ ప్రకటన చేయడం పై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.