అధికార పార్టీ నాయకుడు చేతిలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో పోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నాక కూడా ఆయన పట్ల పోలీసులు కనబరిచిన గౌరవమర్యాదలు ఆశ్చర్యాన్ని కలిగించాయని తెలిపారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని విమర్శించిన పవన్ కళ్యాణ్.. ఈ మేరకు పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“స్వయానా ముఖ్యమంత్రిపై జరిగిన కోడి కత్తి కేసులో.. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నవారే.. ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. కోడి కత్తి కేసు ఇప్పటికైనా.. ఒక కొలిక్కి వచ్చిందో.. లేదో.. కూడా తెలియదు. ఇక.. పులివెందులలో చోటుచేసుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఆ కేసు ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. అసలు దోషులెవరో తేలలేదు. ఇవే కాదు.. సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గిరిబాబు ” అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగింది. అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఓ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పోలీసులు చేస్తున్న అరాచకాలు చాలా ఉన్నాయి.
ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవు. ఇక్కడ దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం న్యాయం జరగదు. ఎవరేం చేయలేరనే ధైర్యం నేరస్థులకు కలిగింది. ఈ పాలకుల వైఖరే ఇందుకు కారణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైకాపా పాలకుల నుంచి ఇంతకు మించి ఆశించలేం. వారికి చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే.. హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేవారు. శాసనమండలి నుంచి భర్తరప్ చేసేవారు. ఇకనైనా పోలీసులు తీరు మారాలి. పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై చట్టాలపై విశ్వాసం కలుగుతుంది” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.