మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ రైతు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన ఇంటికి వెళ్లడానికి వాడుతున్న బీటీ రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు అనే రైతు తాడేపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించాడు. తన స్థలంలోనే బీటీ రోడ్డు వేశారని.. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని తెలిపాడు. ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని.. ఇప్పటికే ఆస్పత్రిలో 10 లక్షల రూపాయలు ఖర్చు చేశామని.. మరో ఐదు లక్షలు అవసరమని తెలిపాడు. కానీ తన దగ్గర ఇంక డబ్బు లేదని.. అందుకే తన తండ్రిని కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చానని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.
తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని బాధితుడు శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో.. అత్యవసరమై ఆ భూమి తిరిగి అడుగుతున్నాను అని తెలిపాడు. అంతేకాక దీని గురించి టీడీపీ నేతలకు ఫిర్యాదు చేస్తే.. తమకు కొంత కమీషన్ ఇస్తే.. తప్పకుండా స్థలానికి డబ్బులు ఇప్పించేలా చేస్తామంటూ తనను వేధిస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుత ఆర్థిక కష్టాల నేపథ్యంలో తన స్థలం తనకు తిరిగి అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరుతున్నాడు శ్రీనివాసరావు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలపై స్థానికి టీడీపీ లీడర్లు మండిపడుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని దానిలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.