ఏపీలో వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కాకినాడలో శనివారం ఉదయం నెలకొన్న హైడ్రామా సాయంత్రం వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎమ్మెల్సీ కారులో శవంగా కనిపించిన సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీనే హత్య చేశారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ చెప్పిన విషయాలకు, పోలీసుల విచారణలో తేలిన విషయాలకు పొంతన లేకపోవటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఉదయ్ బాబుని అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టంకు అంగీకరిస్తామని సుబ్రహ్మణ్యం బంధువులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేసేదాకా మృతదేహానికి పోస్టుమార్టం చేయనీయబోమంటూ బాధితురాలి కుటుంబం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య అనిత చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన భర్త మృతదేహన్నీ పోస్టుమార్టానికి పంపేందుకు అనుమతినిస్తూ సంతకం పెట్టాలని తనపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నారని అనిత ఆరోపించారు.
అంతేగాక మహిళా పోలీసులతో తనను కొట్టిస్తున్నారని సంచలన ఆరోపణ చేసింది బాధితురాలు. ఈ మేరకు ఓ వాయిస్ మెసేజ్ను తన కుటుంబ సభ్యులకు పంపినట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ సుబ్రహ్మణ్యం భార్య అనితతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించడం సంచలనంగా మారింది. మరి మిస్టరీగా మారిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.