ఏపీలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సామాన్యులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పటు చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. ఈ అవార్డులను ఆయన మూడు కేటగిరల్లో ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గతంలో తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నచ్చి తనకు మద్దతు పలికారని.. ఏపి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్శిశలూ కష్టపడుతున్నానని అన్నారు. తాము చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు విపక్షాల కంటికి కనిపించడం లేదని.. అందుకే చీటికి మాటికి విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తుందని అన్నారు. వాలంటీర్లు గొప్ప సేవకులు, గొప్ప సైనికులంటూ అభినందించారు. వారందరికీ నా సెల్యూట్ అన్నారు.
దేశం మొత్తం మనవైపు చూసేలా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఒకప్పుడు ఈ విధానం లేదని.. పేద ప్రజల పేర్లు చెప్పి అన్ని పథకాల్లో అందినంత దోచుకున్నారని అన్నారు. ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న సేవలు విపక్షాలకు కనిపించడం లేదని.. సంక్షేమ పథకాలు చూసి బురద జల్లుతున్నాయి. అందుకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.