గత కొంత కాలంగా ఏపిలో అధికార పక్షానికి ప్రతిపక్షం టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల మద్యం బ్రాండ్లపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ రాప్తాడు ఏఎస్ఐ దస్తగిరి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పరిటాల సునీత, శ్రీరామ్తో పాటు 39 మంది టీడీపీ నేతలపై 143, 341, 188ఆర్డబ్ల్యూ ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ -44 జాతీయ రహదారిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారని.. ఆ సమయంలో బెంగళూరు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో పాటు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ ఏఎస్ఐ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు.