మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త కాబినెట్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరకి తెలిసిందే. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారని వార్తలొచ్చాయి. అయితే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల వెళ్లి బుజ్జగించడంతో.. సీఎంతో భేటీకి అంగీకరించిన బాలినేని దాదాపు గంటన్నర సేపు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. భేటీలో జగన్ ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ.. బాలినేని మాత్రం వెనక్కు తగ్గారు.
జగన్ తో భేటీ అనంతరం బయటకొచ్చిన బాలినేని మీడియాతో మాట్లాడారు. ” వైయస్ కుటుంబానికి నేను ఎప్పుడు విధేయుడినే. మంత్రి పదవి కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. 25 మంది మంత్రుల్ని మారుస్తారన్నప్పుడు కూడా మొదటగా స్పందించింది నేనే. పార్టీ ఏ బాధ్యతలిచ్చినా నేను నిర్వహిస్తా. ఆదిమూలపు సురేష్ తో నాకు వివాదాలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. అవన్నీ అవాస్తవాలే. ఎవరైనా మంత్రి పదవి పోయినపుడు కొంచెం బాధపడటం సహజం. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది సీఎం జగన్ సొంత నిర్ణయం. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పని చేస్తా. జగన్ ఏ భాద్యతలిచ్చినా నాకు ఓకే. నేను ఇది కావాలి అని అడగలేదు” అని బాలినేని చెప్పుకొచ్చారు.