ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో గౌతమ్ రెడ్డిని హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు.
ఇది కూడా చదవండి : ఆ సమస్య వల్లే గౌతమ్ రెడ్డి మృతి చెందారా..?
ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. గౌతమ్రెడ్డి తొలిసారిగా 2014లో ఎన్నికల్లో పొటీ చేసారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై గౌతమ్రెడ్డి 31,412 ఓట్ల అధిక్యతతో గెలిచాడు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్ రెడ్డి రికార్డు సృష్టించారు.గౌతమ్ రెడ్డి జీవిత విశేషాలు…
పేరు : మేకపాటి గౌతమ్రెడ్డి
జన్మస్థలం : బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్రెడ్డి, మణిమంజరి
విద్యార్హత : ఎమ్మెస్సీ, టెక్స్టైల్స్(మాంచెస్టర్, యూకే)
కుటుంబం : భార్య – శ్రీకీర్తి, కుమార్తె- అన్యన్యరెడ్డి, కుమారుడు- అర్జున్రెడ్డి
బాధ్యతలు : కె.ఎం.సి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
రాజకీయ ప్రస్థానం..
2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైఎస్సార్సీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.2 రోజులు సంతాప దినాలు
గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఏపీలో పెట్టుబడులు పెట్టి అందరం ఎదుగుదామంటూ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ “యూ గ్రో వి గ్రో” అనే నినాదాన్ని మంత్రి మేకపాటి ఇచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఏపీలో ఇండస్ట్రీల స్థాపనకు, యువతకు ఉపాధి కల్పించేందుకు గాను నిత్యం కృషి చేసిన గౌతమ్ రెడ్డి.. ఇంత సడెన్ గా మృతి చెందడం ఆయన కుటుంబంతో పాటు పార్టీకి తీరని లోటనే చెప్పవచ్చు. రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి.. ఇంత హఠాత్తుగా మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.