టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్థరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. అశోక్ బాబు అరెస్ట్ తో అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైడ్రామా నడుస్తోంది. అశోక్ బాబు ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో విజయవాడ పటమటలంకలో సీఐడీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో అశోక్ బాబును అరెస్ట్ చేసినట్లు.. సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. అశోక్ బాబుపై పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
అరెస్ట్ కు కారణం ఏంటంటే..
అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా పని చేయక ముందు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ విభాగంలో పని చేశారు. ఆ సమయంలో పదోన్నతి కోసం, బీకాం డిగ్రీ ఉన్నట్టుగా పేర్కొన్నారని, సర్వీస్ రికార్డులు ట్యాంపర్ చేశారని, ఆయన పై అభియోగాలు నమోదు అయ్యాయి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే అభియోగాలు రాగా, అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపింది.
టైపింగ్ తప్పిదం వల్లే సమస్య..
అశోక్ బాబు రికార్డులు ఏమి ట్యాంపర్ చేయలేదని, ఆయన డి.కాం అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అని చెప్తే, రికార్డు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపింగ్ లో తప్పు చేసి, బీకాం అని టైపు చేశారని, అప్పట్లో విజిలెన్స్ విభాగం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పై కేసు పెట్టటంతో, అశోక్ బాబు పది రోజుల క్రిందటే ఈ కేసు పై స్పందించారు. తనపై వస్తోన్న ఈ ఆరోపణల వెనక ఒక ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నారంటూ ఆయన పేరు వెల్లడించారు. అతని అధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ ఉద్యోగ సంఘ నేత వెనుక ప్రభుత్వం ఉందని అశోక్ బాబు ఆరోపణలు చేశారు. దీని పైన లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు.
అశోక్ బాబు లోకాయుక్తాకు ఫిర్యాదు చేస్తే, వారు ఎంక్వయిరీ చేయకుండా, సీఐడీ విభాగానికి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసారు. సీఐడీ దీని పైన కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి చిన్న కేసు విషయంలో, కనీసం ప్రాథమిక ఎంక్వయిరీ కూడా చేయకుండా, గతంలోనే ముగిసిపోయిన అంశాన్ని, ఇప్పుడు తెరపైకి తెచ్చి, ఏదో పెద్ద నేరం లాగా, అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం అశోక్ బాబు గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్నారు.
గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత
అశోక్ బాబు అరెస్ట్ చేయడంతో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. అక్రమ కేసులు బనాయించారని.. ఆయనను వెంటనే మీడియాకు చూపించాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు సీఐడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.