ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం ఎన్నో ఘోరాలు.. నేరాలకు పాల్పపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి దోచుకుంటున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బు వస్తే చాలు అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. ఇక టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల దోపిడీ కూడా భారీగా పెరిగిపోతుంది. తాజాగా ‘లవ్ లైఫ్’ సైబర్ మోసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు తదితర పట్టణాల పరిధిలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇక విజయవాడలోని సైబర్ పోలీసు స్టేషన్కు బాధితులు క్యూ కట్టారు. రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది బాధితులు లవ్ లైఫ్ లో పెట్టుబడులు పెట్టారని, ఈ మొత్తం విలువ రూ.200 కోట్ల పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ‘నేచర్ అండ్ హెల్త్’ నినాదంతో కొవిడ్ సమయంలో రోగులకు అవసరమైన వైద్య పరికరాల కోసం తమతో డివైజ్ల రీచార్జిలు చేయించారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో రూ.లక్షలు పెట్టుబడులు పెట్టించి బోర్డు తిప్పేశారని గగ్గోలు పెట్టారు. ఇప్పటి వరకు 18 లక్షలు కట్టినట్టు బెజవాడ సైబర్ పోలీసులకు ఓ బాధితుడు అధికారిక ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుల నుంచి సైబర్ పోలీసులు ఫిర్యాదులు స్వీకరించారు.
ఇదీ కూడా చదవండి : బెడిసి కొట్టిన లేడీ సింగర్ సాహసం.. వీడియో వైరల్
పార్ట్టైమ్ జాబ్ పేరుతో టైలింజిన్ అనసూయ అనే మహిళ టెలీ గ్రామ్ యాప్ ద్వారా గ్రూపులు క్రియేట్ చేసి ఒక్కో గ్రూపులో 250 మంది వరకు యాడ్ చేసింది. ‘లవ్ లైఫ్’లో మెడికల్ డి వైజ్ల రీ చార్జిల ద్వారా పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి పదిరెట్ల వరకు లాభాలు పొందవచ్చని ఆఫర్ చేశారు. టైలింజిన్ అనసూయ కేవలం వాట్సాప్ చాటింగ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా బాధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పండుగల పేరిట బంపర్ ఆఫర్పెట్టి లక్షల రూపాయలు కురుస్తాయంటూ ఆశ చూపింది.. చివరికి బోర్డు తిప్పేయడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి లబోదిబోమంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనసూయ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.