Virata Parvam: ప్రేమ.. ఓ మధురమైన భావం. ఆ అనుభూతి మౌనాన్ని మాటగా మార్చగలదు. చీకటి నుండి వెలుగును తీసుకురాగలదు. భయాన్ని దైర్యంగా చేయగలదు. ఓ సాధారణ ఆడపిల్లని తన మనసైన వాడి కోసం అడవుల్లోకి పరుగులు తీయించగలదు. తుపాకీ చప్పుళ్లను ఎదిరించగలదు, అన్నీటికి మించి ప్రేమించిన వాడి కోసం చావునైనా ఎదిరించేలా చేయగలదు. ఇదేదో విరాటపర్వం సినిమా కథలాగా ఉంది అనుకుంటున్నారా? మీరు ఊహించింది నూటికి నూరు శాతం నిజం. విరాటపర్వంలోని సాయిపల్లవి క్యారెక్టర్ని జజ్జర్ల సమ్మక్క అనే మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఆమె తన బావకోసమే బతికింది.. బావకోసమే అడికి వెళ్లింది.. మావోయిస్టు అయింది.. అతడితో పాటే ప్రాణాలు విడిచింది. ఆమె బావ పేరు యాప నారాయణ.. అలియాస్ హరిభూషణ్. ఇప్పటిలాగా సోమవారం మొదలై, ఆదివారంతో ముగిసిపోయే ప్రేమ కాదు సమ్మక్కది.
ఆమెకు బావ యాప నారాయణ అంటే ప్రాణం. చిన్ననాటి నుండి బావ తప్ప మరో లోకం తెలియదు. కాలేజీ చదువుల కోసం తన బావ మన్యం దాటి.. టౌన్ కి వెళ్తేనే గుండెలు పగిలేలా ఏడ్చినంత ప్రేమ ఆమెది. డిగ్రీ పట్టా చేతికి అందాక తన బావ వచ్చి.., తన మెడలో మూడు ముళ్ళు వేస్తాడని జజ్జర్ల సమ్మక్క కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది. కానీ.., విధి రాత ఇంకోలా ఉంది. హన్మకొండలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. యాప నారాయణ రాడికల్ స్టూడెంట్ యూనియన్ పట్ల ప్రభావితుడిఫై మావోయిస్టు దళంలో చేరిపోయాడు. తన లక్ష్యం కోసం మరదలిపై తనకున్న ప్రేమని కూడా త్యాగం చేశాడు. అలా యాప నారాయణ 1991లో మావోయిస్టు సభ్యుడు అయిపోయాడు. కానీ.., ఇక్కడ జజ్జర్ల సమ్మక్కకి తన బావ అంత విశాల హృదయం లేదు.ఆమెకి తెలిసింది బావ ఒక్కడే, బావపై పెంచుకున్న ప్రేమ ఒక్కటే. తన బావ ఎక్కడ ఉంటే అక్కడే తనకి బ్రతుకు అనుకుంది. ఇందుకోసం సమాజాన్ని ఎదురించింది. ఇంటి గుమ్మం దాటి తన బావని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. ఆ అడవిలోనే బావను పెళ్లాడింది. ఇక అప్పటినుంచి ఆమె కూడా మావోయిస్టు సభ్యురాలు అయిపోయింది. ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో తన బావ హరిభూషణ్ వెంటే నడించింది సమ్మక్క. కష్టాలు, కన్నీళ్లు, చట్టాలు, తూటాలు, బంధాలు, బంధువులు ఏవి కూడా ఈ ఇద్దర్నీ వేరు చేయలేకపోయాయి. ఇలాంటి సమయంలో 2008లో సమ్మక్కకి ఆరోగ్యం చెడిపోయింది. ఈ కారణంగా వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అవసరమైన ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేసి వేసిన కుట్ల పచ్చి కూడా తగ్గకుండానే మళ్ళీ తన బావని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. బావ అంటే అంత ప్రేమ ఆమెకి.
ఇలా ప్రపంచంలో ఏ శక్తి వీరిని వేరు చేయలేకపోయింది. కానీ.., కొన్ని లక్షల మంది జీవితాల్ని నాశనం చేసిన కరోనా మహమ్మారి వీరిద్దరినీ దూరం చేయటానికి చూసింది. బావ హరిభూషణ్ కి అడవిలో కరోనా సోకింది. సమ్మక్క తనకి చేతనైన సేవలు అన్నీ చేసింది. కానీ.., అతను బతకలేదు. తన ప్రాణానికి ప్రాణం అయిన బావ చనిపోవడంతో సమ్మక్క కూడా ఆ మహమ్మారి దెబ్బ నుండి కోలుకోలేకపోయింది. ఆమె కూడా కరోనా కారణంగా కుప్పకూలింది. బ్రతికినంత కాలం చావుని ఎదిరించి నిలిచిన సమ్మక్క ప్రేమ.. చావులో కూడా విజయమే సాధించింది. మన్యంలో మొదలైన వీరి ప్రేమ.., దండ కారణ్యంలో ఇలా ముగిసింది. సైద్ధాంతిక పరంగా వీరు చేసింది తప్పా, ఒప్పా అన్న విషయాలను పక్కన పెడితే వీరి ప్రేమ మాత్రం నిజంగా అజరామరం… చిరస్మరణీయం. మరి, సమ్మక్క, నారాయణల ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Suriya: విక్రమ్ మూవీ కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?