మహిళలపై వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో ఓ తెలుగు టీవీ నటికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగా పట్టించుకోకపోవడంతో.. సదరు టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. భర్త వేధింపుల నుంచి తనను కాపాడండి అంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగకపోవడంతో.. మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు..
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం చేశారు. తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాల కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి లోనైన.. ఆమె పోలీసులకు కాల్ చేసి సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పీఎస్ ఎస్ఐ… ఎస్ఆర్నగర్ పోలీసుల సహాయంతో ఆమె నివాసానికి చేరుకుని మైథిలిని నిమ్స్ దవాఖానాకు తరలించారు.
గతంలో సూర్యాపేట జిల్లా మోతె పీఎస్లో మైథిలి తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. తర్వాత సెప్టెంబర్ 2021లో మరోసారి తన భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త శ్రీధర్తో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణ పూర్తయిందని, ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి న్యాయపరమైన అభిప్రాయం కోసం విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం మైథిలి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సారథి స్టూడియోస్ వెనకాల ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె భర్తపై చేసిన ఫిర్యాదు గురించి వాకబు చేయడానికి పంజాగుట్ట పోలీసు స్టేషన్కు వెళ్లింది. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని మనస్తాపానికి గురైన ఆమె వెంటనే తన ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నటి నివాసానికి చేరుకొని ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నటి మైథిలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. మైథిలీకి ఇది రెండవ వివాహంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.