చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళీ నటుడు కుమరకోమ్ వాసుదేవన్ గురువారం(ఏప్రిల్ 14న) కన్నుమూశారు. 76 ఏళ్ల వయసు కలిగిన వాసుదేవన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా ఇటీవల కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు మలయాళ సినీవర్గాల సమాచారం.
ఇక వాసుదేవన్ 2015లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒట్టాల్’లో కీలకపాత్ర పోషించి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. వాసుదేవన్ కి భార్య రాజమ్మ.. పిల్లలు షాజీ లాల్ మరియు షీబా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 2015లో వచ్చిన ఒట్టాల్ మూవీ.. 2016లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ విభాగంలో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో అనేక అవార్డులను గెలుచుకుంది.
సాధారణంగా వాసుదేవన్ వృత్తిరీత్యా మత్స్యకారుడు. ఒట్టాల్ దర్శకుడు జయరాజ్ ఓరోజు కుమరకోమ్లోని వెంబనాడ్ సరస్సు వద్ద వాసుదేవన్ చేపలు పట్టడం చూసి తన సినిమాలోని క్యారెక్టర్ కి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వాసుదేవన్ చిన్న కుర్రాడి తాత వల్ల్యప్పచ్చాయిగా నటించారు. ఈ చిత్రం ‘పర్యావరణ పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం’ విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకుంది. వాసుదేవన్ మృతిపట్ల దర్శకుడు జయరాజ్, మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.