తెలుగు పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పీసీ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. ఇప్పటికే వరుసగా సినిమా పరిశ్రమ ప్రముఖులను కోల్పోతుండగా ఈయన మృతి అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. దర్శకుడు పీసీ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు.
ఈయన పూర్తి పేరు పి.చంద్రశేఖర్ రెడ్డి. సుమారు 80పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నాటి ప్రముఖ హీరోల అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో చిత్రాలు తెరకెక్కించారు. భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.