టాలీవుడ్ యువహీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. రియల్ హీరో మేజర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. 26/11 ముంబై ఉగ్రదాడులలో మేజర్ సందీప్ పోరాట పటిమను, అతని జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ఈ సినిమాను హీరో మహేష్ బాబుతో పాటు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి తాజాగా మేజర్ చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్మీలో చేరాలని అనుకుంటున్న వారికోసం ఓ గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా మేజర్ సందీప్ పాత్రను పోషించిన అడివి శేష్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఓ రూల్ ఉంది. మార్నింగ్ షో అవ్వగానే ఫోన్.. కాల్స్ తో మోత మోగిపోయిందంటే బ్లాక్ బస్టర్ అని, మీ సినిమా గురించి మంచి టాక్ వింటున్నాం అని మెసేజులు వస్తే పర్వాలేదని అంటుంటారు. నిన్నటి నుండి నా ఫోన్ కి ఖాళీ లేదు. ఫ్రీజ్ అయిపోయింది. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోలిస్తే మేజర్.. ఫైనాన్సియల్ గా, ఎమోషనల్ గా, ఎలా చూసుకున్నా ఐదు రెట్లు పెద్ద హిట్ అయ్యింది.
సినిమా పెద్ద హిట్ అయ్యింది కదా తడిగుడ్డ వేసుకొని పడుకో.. అని చాలామంది చెబుతున్నారు. కానీ నాకిది సరిపోదు. మేజర్ సందీప్ ఆశయాలను, ఆయన కథను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇంకేదైనా చేయాలని ఉంది. ఈరోజు నేను సందీప్ వాళ్ళ పేరెంట్స్ ని, నా గురువు గారు అబ్బూరి రవిని మిస్ అవుతున్నా. వాళ్ళిక్కడికి రాలేకపోయారు. మేజర్ సినిమా చూసి చాలామంది ఆర్మీలో చేరాలనుకుంటున్నా అని మెసేజులు పెడుతున్నారు. వాళ్ళకోసం ఇదే మేజర్ ప్రామిస్.
ఎవరైతే ఆర్మీలో చేరేందుకు సోర్స్ లేక కష్టపడుతున్నారో.. ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలలు కంటున్నారో అలాంటివాళ్లకు మేం సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఎలా అనేది త్వరలో చెబుతాం. ముందుగా పదిమందితో ప్రారంభించి ఆ తర్వాత మేజర్ సందీప్ ఆశయం.. కోట్ల మందిలో కలుగుతుందని భావిస్తున్నాం. దీన్ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతోనే ప్రారంభించనున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అడివి శేష్ మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. మరి శేష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.