యూరప్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేసే ఉద్ధేశంలో ఉన్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా స్పష్టంచేసింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేధికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. యూరప్ యూజర్ల డేటాను అమెరికాలోని మెటా సర్వర్లకు బదిలీ చేయకుండా 2020 లో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డేటా ప్రైవసీ పేరుతో వినియోగదారుల సమాచారాన్ని అమెరికాలోని తమ ప్రధాన సర్వర్లకు తరలించకుండా అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల తాము అక్కడి వినియోగదారులకు సేవలను అందిచలేమని.. ఒకవేళ సంస్థ సేవలను మూసివేయవలసిన పరిస్థితి ఎదురైతే.. యూరప్ ఖండం మెుత్తం తమ సేవలకు దూరమౌతుందని హెచ్చరించింది.
కొత్తగా తీసుకొస్తున్న చట్టాన్ని వ్యాపార అనుకూలంగా ఉండేలా చూసేందుకు మెటా సంస్థ అమెరికా ప్రభుత్వం తరఫునుంచి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తమ సేవలను నిరంతరాయంగా, వినియోగదారులకు ప్రమోట్ చేయడంలో.. డేటా ట్రాన్ఫర్ ఎంత ముఖ్యమైనదో యూరోపియన్ ప్రభుత్వానికి, కోర్టులకు వివరిస్తోంది. యురోపియన్ యూనియన్ కొత్త నియమాలు ఫేస్బుక్ అందించే సేవలు, ప్రకటనలపై ఆధారపడే ఐరోపాలోని చాలా వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని సంస్థ తెలిపింది.
డేటా ప్రైవసీ పేరుతో ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగించి.. వాటి స్థానంలో అందరికీ అనుకూలమైన చట్టాలను త్వరితగతిన తీసుకురాలేకపోతే తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోతాయని తేల్చి చెప్పింది. కొత్త చట్టాలు, నిబంధనలు “ప్రతికూల ఫలితాలకు” దారితీస్తాయని, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని మెటా అభిప్రాయపడింది. యూజర్ డేటా విషయంలో సోషల్ మీడియా సంస్థ, చట్టసభ సభ్యుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను వార్షిక నివేధికలో సంస్థ హైలైట్ చేసింది.