ఇంటర్నెట్ డేటా చీప్గా లభిస్తుండటంతో చాలా మందికి స్మార్ట్ ఫోన్ వినియోగం ఒక వ్యసనంగా మారింది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పన్నెడింటి వరకు అందులోనే గడిపేస్తున్నారు. ఎప్పుడు లేస్తారో.. ఎప్పుడు తింటున్నారో, పడుకుంటున్నారో అర్థం కానీ విధంగా దానికి బానిసలుగా మారుతున్నారు. అయితే అందరు ఇలానే ఉంటున్నారా అంటే కాదు.. కొందరు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వాడుకుని.. బోలెడంత ఆదాయం ఆర్జిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నో కుటుంబాలను యూట్యూబ్ పోషిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. లాక్డౌన్ కారణంగా ఇంటికో యూట్యూబ్ చానెల్ పుట్టుకొచ్చింది. ఇక విద్యాసంస్థలు కూడా ఆన్లైన్ చదువుల మీద దృష్టి పెట్టడంతో.. యూట్యూబ్లో పాఠాలు భోదించే వారికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. యూట్యూబ్ను నమ్ముకున్న ఓ వ్యక్తి.. ఏడాదికి అక్షరాల 40 కోట్ల రూపాయల వేతనం లభించే ఉద్యోగం ఇస్తామన్నా ఆఫర్ను కాదనుకున్నాడు. యూట్యూబ్ జర్నీనే కొనసాగించాడు. మరి చివరకు అతను తన ప్రయాణంలో విజయం సాధించాడా లేదా తెలియాలంటే.. ఇది చదవండి.
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి చెందిన అలఖ్ పాండే ఆర్థికంగా అంత గొప్ప కుటుంబం కాదు. ప్రతీ నెల చివర డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సి వచ్చేది. దీంతో తన ఖర్చుల కోసం 9వ తరగతి నుంచే ఐదారు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలెట్టారు. అవసరం కోసం మొదలైన ట్యూషన్లు చివరికి వ్యాపకంగా మారిపోయాయి. ఇంటర్ చేదువుతూనే టెన్త్ స్టూడెంట్లకు పాఠాలు చెప్పాడు. ఐఐటీలో సీటు పొందడం లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆర్థిక ఇబ్బందులు, సరైన గైడెన్స్ లేక ఆ కల నెరవేర్చుకోలేకపోయాడు.
లక్షల్లో జీతం
అలఖ్ పాండేకు.. టీచింగ్ అలవాటుగా మారడంతో ఉద్యోగ ప్రయత్నాలు మాని ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు. ఆనోటా ఈనోటా అలఖ్ పాండే గురించి తెలియడంతో కార్పొరేటు కాలేజీలు కన్నేశాయి. లక్షల రూపాయల వేతనం ఇస్తామంటూ తమ కాలేజీల్లో చేర్చుకున్నాయి. ఇక అప్పటి నుంచి తీరిక లేకుండా క్లాసుల మీద క్లాసులు తీసుకోవడం అలఖ్ పాండే దినచర్యగా మారిపోయింది. ఇలా క్లాసుల వారీగా సెక్షన్ల వారీగా తీసుకోవడం కంటే ఒకేసారి వేలాది మందికి పాఠాలు చెప్పే వెసులుబాటు ఉందంటూ ఓ స్నేహితుడు చెప్పాడు అలోఖ్కి. ఆ ఆలోచనతో..
యూట్యూబ్లో
‘ఫిజిక్స్వాలా’ పేరుతో 2014లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు అలోఖ్. ఆరంభంలోనే 10వేల మంది చందాదారులు. అయితే ప్రైవేటు కాలేజీలో పాఠాలు బోధించడం మానలేదు. ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్ ఛానల్కి ఆశించినంత స్పందన రాలేదు. అయితే 2016లో డేటా విప్లవం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో 2017లో కాలేజీలో వస్తున్న మంచి సంపాదన వద్దనుకుని పూర్తిగా యూట్యూబ్కే అంకితమయ్యాడు. ఫిజిక్స్వాలా పేరుతో నీట్, జేఈఈ విద్యార్థులకు యూట్యూబ్లో కోచింగ్ షురూ చేశారు. రెండేళ్లు కష్టపడితే కానీ 2019లో యూట్యూబ్ ద్వారా ఆదాయం ఆశించినంతగా రాలేదు.
బంపర్ ఆఫర్
ఇదే సమయంలో యూట్యూబ్ను నమ్ముకుని ఎన్నాళ్లు ఉంటావ్. అరటి పండు ఒలిచినట్టు పాఠాలు చెప్పే సత్తా నీకు ఉంది. మా సంస్థలో చేరమంటూ ఓ ఎడ్టెక్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ. 3.30 కోట్ల వంతున ఏడాదికి రూ.40 కోట్ల వార్షిక వేతనం అందిస్తామంటూ ఆహ్వానం పలికింది. కానీ ఆ ఆఫర్ను 2019 చివర్లో సున్నితంగా తిరస్కరించాడు అలోఖ్. అతన్నో పిచ్చోడిలా చూశారంతా ఆ సమయంలో.
ఫిజిక్స్వాలాకు ప్రాణం పోసిన కరోనా
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో ప్రపంచమంతా స్థంభించి పోయింది. అప్పుడు ఆన్లైన్ క్లాసులే విద్యార్థులకు దిక్కయ్యాయి. దీంతో 2020 జూన్లో ఫిజిక్స్వాలా పేరుతో యాప్ రిలీజ్ చేసి ఎడ్టెక్ రంగంలోకి అడుగు పెట్టాడు. మిగిలిన ఎడ్కంపెనీల కంటే తక్కువ ఫీజు ఆఫర్ చేయడం, అప్పటికే మార్కెట్లో అలోఖ్కి ఉన్న ఇమేజ్ తోడవటంతో అనతి కాలంలోనే ఫిజిక్స్ వాలా సక్సెస్ ట్రాక్ పట్టింది.
త్వరలో యూనికార్న్
రెండేళ్లు గడిచే సరికి ఫిజిక్స్వాలా స్టార్టప్కి పది లక్షల మంది పెయిండ్ విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. గంటల కొద్ది పాఠాలు అప్లోడ్ అవుతున్నాయి. లాభాల పరంపర మొదలైంది. తొలి ఏడాది రూ.9 కోట్ల లాభం రాగా మలి ఏడాది రూ.24 కోట్ల లాభం నమోదు చేసింది. ఇన్వెస్టర్ల కన్ను పడింది. వెంటనే పెట్టుబడులు వరద మొదలైంది. తాజాగా జరుగుతున్న చర్చలతో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి వంద మిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ సాధించింది. ఈ నిధులు కనుక వస్తే యూనికార్న్ హోదా సాధించిన ఏడో ఎడ్టెక్ కంపెనీగా ఫిజిక్స్వాలా రికార్డులకెక్కుతుంది.
ఉద్యోగి కాదు యజమాని
అంతా కలిపితే అలోఖ్ పాండే ప్రస్తుత వయస్సు 30 ఏళ్లు మాత్రమే. ఇండియాలో యూనికార్న్ హోదా సాధించిన స్టార్టప్లలో నూటికి 90 శాతం ఐఐటీ పూర్వ విద్యార్థులవే ఉన్నాయి. కానీ అలోఖ్కి ఐఐటీ బ్యాక్గ్రౌండ్ లేదు. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పాలనే ఆసక్తి. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లలో వచ్చే ప్రతిస్పందన ఆధారంగా తన పాఠాలకు మెరుగులు పెట్టుకుంటో ముందుకు పోయాడు. కోట్లాది రూపాలయ వేతనం ఆఫర్ ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. దీంతో కోట్ల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగిగా కాకుంటా కోట్లాది రూపాయల విలువైన కంపెనీకి యజమానిగా నిలిచాడు.
The man who made a huge revolution to indian education history. The man who inspired millions of students.
A huge respect to you sir.
Lots of wishes to complete two years in this revolution.
.#AlakhPandey
.#Pwians#shunyasealakhtak pic.twitter.com/61gbVwoz0B— Anya Singh (@anya_singh_2610) May 26, 2022