ఇండియన్ మల్టీనేషన్ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా మరో సంచలనానికి సిద్ధమయ్యింది. గతేడాది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్.. తాజాగా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్ చేసింది. భారత 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్ను ఆవిష్కరించింది. 2024 కల్లా ఓలా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వస్తాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. కేవలం నాలుగు సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ అందుకోగల సామర్థ్యం దీని సొంతం అని అన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ. దూరం ఈ కారు ప్రయాణిస్తుందన్నారు. "నూతన భారతదేశాన్ని నిర్వచించే కారు ఇప్పుడు మనకు అవసరం. దేశంలోని వేగవంతమైన కార్లలో ఇది ఒకటిగా ఉండనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకన్లలోనే అందుకోనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ను అందించనుంది. పూర్తి గ్లాస్ రూఫ్తో ఈ కారు లాంచ్ కానుంది. మనదేశంలో రూపొందించిన కార్లలో అత్యంత స్పోర్టియస్ట్ కారు ఇదే. మూవ్ఓఎస్, అసిస్టెడ్ డ్రైవింగ్ సామర్థ్యాలు కూడా ఈ కారులో ఉండనున్నాయి. ఈ కారుకు కీ కానీ, హ్యాండిల్ కానీ అవసరం లేదు.’ అని భవీష్ అగర్వాల్ తెలిపారు. తమిళనాడు, పోచంపల్లిలో గల ఫ్యూచర్ ఫ్యాక్టరీని విస్తరిస్తామని చెప్పారు. దీన్ని భారతదేశంలోనే అతిపెద్ద ఈవీ ఆటో హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 100 ఎకరాల విస్తీర్ణంలో లిథియం ఐయాన్ సెల్ ప్లాంట్, 200 ఎకరాల్లో ఈవీ కార్ ప్లాంట్, అదనంగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఈవీ స్కూటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఏటా కోటి స్కూటర్లు, 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లు, ఓలా గిగా ఫ్యాక్టరీ 100 జీడబ్ల్యూహెచ్ సెల్స్ తయారు చేస్తుందన్నారు. దేశంలోని 50 ప్రధాన నగరాల పరిధిలో 100కి పైగా హైపర్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇదీ చదవండి: Ola Electric Scooter: బడ్జెట్ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 131 కి.మీ.! ఇదీ చదవండి: Electric Car: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..