టెక్ ప్రియులు.. ఏ ఫోన్ కోసమైతే ఏడాది పాటు ఎదురుచూస్తారో ఆ ఫోన్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సరికొత్త ఫీచర్లతో వావ్ అనిపిస్తోంది. అదే యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈవెంట్ లో ఐఫోన్ కొత్త వెర్షన్స్ కి సంబంధించిన పలు మోడల్స్ ని ఆవిష్కరించారు. వీటితో పాటే వాచ్ సిరీస్ ని కూడా లాంచ్ చేశారు. కొత్త యాపిల్ ఉత్పత్తుల్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ తో పాటు వాచీ సిరీస్ 8, వాచీ ఎస్ఈ2, వాచీ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో ప్రొడక్ట్ ప్రత్యేకత, ధర, ఎప్పుడు మార్కెట్ లోకి రాబోతున్నాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ లో ఐఫోన్ కొత్త సిరీస్ ధరలు: ఐఫోన్ 14: రూ.79,900(128జీబీ), రూ.89,900(256జీబీ), రూ.1,09,900 (512జీబీ) ఐఫోన్ 14 ప్లస్: రూ.89,900(128 జీబీ), రూ.99,900(256జీబీ), రూ.1,19,900(512జీబీ) ఐఫోన్ 14 ప్రో: రూ.1,29,900(128జీబీ), రూ.1,39,900(256 జీబీ), రూ.1,59,900(512జీబీ) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్: రూ 1,39,900(128జీబీ), రూ.1,49,900(256జీబీ), రూ.1,69,900(512జీబీ), రూ.1,89,900(1టీబీ) ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14కు 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, 14 ప్లస్ కోసం 6.7 అంగుళాల స్క్రీన్ అమర్చారు. మిడ్ నైట్, స్టార్ లైట్, బ్లూ, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో బ్యాటరీ ఐఫోన్ చరిత్రలో అత్యుత్తమని చెబుతోంది. ఏ15 బయోనిక్ చిప్, 12 మెగాపిక్సెల్ వెనకా ముందు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 14 సెప్టెంబరు 16న, 14 ప్లస్ అక్టోబరు 7న మార్కెట్ లోకి రానున్నాయి. ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్: 14 ప్రోకి 6.1 అంగుళాల స్క్రీన్, 14 ప్రో మ్యాక్స్ కి 6.7 అంగుళాల స్క్రీన్ ఉండనుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు సెప్టెంబరు 16 నుంచి మార్కెట్ లోకి రానున్నాయి. వాచీ సిరీస్ 8: సరికొత్త డిజైన్ కి తోడు టెక్నాలజీ, సెన్సార్లతో ఈ వాచీని తీసుకొచ్చారు. ఇందులోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ దీని ప్రత్యేకత. ప్రారంభ ధర రూ.31,802. సెప్టెంబరు 16 నుంచి అందుబాటులోకి వస్తుంది. వాచీ ఎస్ఈ2లో క్రాష్ డిటెక్షన్ తో పాటు ఫాల్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ప్రారంభ ధర సుమారు రూ.20 వేలు. వాచీ అల్ట్రాలో క్రాష్ డిటెక్షన్, కంపాస్, డెప్త్ గేజ్, నైట్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి. భారత్ లో దీని ధర రూ.89,900. సెప్టెంబరు 23 నుంచి మార్కెట్ లోకి రానుంది. ఎయిర్ పాడ్స్ ప్రో: కొత్త హెడ్2 చిప్ కలిగిన ఈ హెడ్ ఫోన్స్.. ఐదు పరిమాణాల్లో లభించనున్నాయి. 30 గంటలపాటు పనిచేసే వీటి ధర దాదాపు రూ.20 వేలు. సెప్టెంబరు 23 నుంచి మార్కెట్ లోకి వస్తాయి. ఐఫోన్ 14, 14 ప్లస్ ఫోన్లలో ఉన్న మరో అడ్వాంటేజ్ సెల్యులర్ రిసెప్షన్.. అంటే నెట్ వర్క్ సిగ్నల్ లేకపోయినా శాటిలైట్ ద్వారా ఎస్ఎంఎస్ లు పంపించవచ్చు. అమెరికా, కెనడాలో ఈ సర్వీసు రెండేళ్లు ఉచితం. భారత దేశ వినియోగదారులకు మాత్రం ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు. అమెరికాలో విక్రయించే 14, 14 ప్లస్ ఫోన్స్.. ఈ-సిమ్ తో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర మాత్రం సిమ్ కార్డ్ ట్రేతో కూడిన ఫోన్స్ విక్రయించనున్నారు. ఇదీ చదవండి: తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకునే అవకాశం.. ఏకంగా రూ. 14,000 డిస్కౌంట్!