ఫామ్లో లేడు.. సెంచరీ లేదు.. రెస్ట్ తీసుకోవాలి.. అలా ఆడాలి.. ఇలా ఆడాలి.. అంటూ చాలా కాలంగా కోహ్లీపై చర్చ. ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్పై ఎంత ఆసక్తి నెలకొందో.. ఆ మ్యాచ్లో కోహ్లీ ఎలా ఆడుతాడో అనే దానిపై కూడా క్రికెట్ అభిమానుల్లో అంతే టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఆసియా కప్ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 28న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే టూర్ల నుంచి రెస్ట్ తీసుకున్న కోహ్లీ కూడా జట్టుతో పాటు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా టాప్ బౌలర్లను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ల బౌలింగ్లో ఆడాడు. చాలా రోజులుగా క్రికెట్కు దూరంగా ఉన్న కోహ్లీ.. తొలి రోజు ఎలా ప్రాక్టీస్ను నిదానంగా ఆరంభిస్తాడనుకుంటే.. ఒక్కసారిగా చెలరేగిపోయాడు. జడేజా బౌలింగ్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చాలా బంతులు ఎదుర్కొని, సెంచరీ చేసిన తర్వాత ఆడుతున్నట్లు షాట్లు కొట్టాడు. కోహ్లీ ప్రాక్టీస్ చూస్తుంటే ఫామ్లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నాడు. పైగా పాకిస్థాన్తోనే తొలి మ్యాచ్ కావడంతో కోహ్లీకి అంది కలిసొచ్చే అంశమే. ఎందుకంటే పాకిస్థాన్పై కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో జట్టు మొత్తం విఫలం అయినా.. కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. నిజానికి పాక్తో మ్యాచ్ అంటేనే కోహ్లీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎంత ఒత్తిడి ఉంటే కోహ్లీ అంత బాగా ఆడతాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఫామ్ సంగతి పక్కన పెడితే.. పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఆటగాళ్లపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ దాయాది పోరుకు ఉంటే క్రేజ్, అంచనాల నేపథ్యంలో ఆ మాత్రం ఒత్తిడి సహజం. ఇలాంటి సమయంలో కోహ్లీలోని ది బెస్ట్ బయటకొస్తుంది. మరి ఆదివారం పాకిస్థాన్తో జరగబోయే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్లో ఎదురైన దారుణ ఓటమికి బదులు తీర్చుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి కోహ్లీ ప్రాక్టీస్ చూస్తుంటే మీకేం అనిపిస్తుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ద్రవిడ్ నుంచి సెహ్వాగ్ స్టైల్కు మారుతున్న పుజారా! టార్గెట్ అదేనా..?