టీమిండియాలోకి అడుగుపెట్టింది మొదలు జట్టుకు భారం కాకుండా.. టాలెంట్ పేరుతో ఛాన్సుల మీద ఛాన్సుల తీసుకోలేదు. టీమ్లోకి రావడం రావడంతోనే పరుగులు వరద పారించాడు. అతని ఆట చూసి ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్తోనే పోల్చారు. ఆ పొగడ్తకు పొంగిపోకుండా.. టీమ్ కోసం ప్రాణం పెట్టి ఆడాడు. బాగా ఆడినన్ని రోజులు అతని ఆటను ఎంజాయ్ చేసిన వాళ్లు.. కొన్ని మ్యాచ్ల్లో పరుగులు చేయకపోవడంతో.. విమర్శల వర్షం కురిపించారు. జట్టుకు భారంగా మారావని, రిటైర్మెంట్కు టైమొచ్చిందని ఇష్టమొచ్చినట్లు ఏకిపారేశారు. తన బ్యాటింగ్తో పాటు మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న భారాన్ని, ఒత్తిడిని ఎవరూ గమనించలేదు. కేవలం అతని బ్యాట్ నుంచి కొన్ని పరుగులు తగ్గాయనే కోపంతో అతనిపై విమర్శలు గుప్పించారు. అడ్డగోలు విమర్శలకు ఏనాడు నోటితో సమాధానం చెప్పని విరాట్ కోహ్లీ.. తన బ్యాట్తోనే బుదులు చెప్పాడు. ఆసియా కప్కు ముందు ఆరు వారాల విశ్రాంతి తర్వాత.. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది! అనే మాట కోహ్లీ విషయంలో వందశాతం నిజమైంది. ఇప్పటికే ఆసియా కప్ 2022 నుంచి నిష్క్రమించిన టీమిండియా ప్రదర్శన చూసి అఫ్ఘినస్థాన్పై కూడా ఓడిపోతారా? అనే భయం కలిగింది. నామమాత్రపు మ్యాచ్ అయినా పరువు కోసం గెలవాల్సిన పరిస్థితి. జట్టులో భారీ మార్పులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. మరోసారి టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన, భయం మొదలయ్యాయి. కానీ.. మ్యాచ్ మొదలై.. కొంత సమయం గడిచిన తర్వాత.. ఇది కోహ్లీ రోజు అనే విషయం అందరికి అర్థమైపోయింది. 2016లో కోహ్లీ ఎలా ఉండేవాడో.. ఎంత ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేసేవాడో.. గురువారం అఫ్ఘనిస్థాన్తో మ్యాచ్లోనే అలాగే ఆడాడు. ఫర్ఫెక్ట్ టైమింగ్, అద్భుతమైన షాట్లతో అదరగొట్టాడు. పెద్ద గ్రౌండ్లో ఏకంగా 6 సిక్సులు, 12 ఫోర్లతో 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి.. చాలా రోజులుగా రాని సెంచరీని ఏకంగా సిక్స్తో సాధించాడు. గురువారం ఆఫ్ఘాన్తో జరిగింది నామమాత్రపు మ్యాచే అయినా.. ఆసియా కప్ నుంచి టీమిండియా ఇంటికెళ్లిందని తెలిసినా.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ఆ బాధ మాత్రం కనిపించలేదు. తొక్కలో ఆసియా కప్ మాకు కింగ్ తిరిగొచ్చాడు. మా కింగ్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడంటూ సంబురపడిపోయారు. ఏకంగా 12 రికార్డులు.. దాదాపు మూడేళ్ల నుంచి కోహ్లీ సెంచరీ చేయలేదు. కానీ.. కోహ్లీ ఖాతాలో అప్పటికే 70 సెంచరీలు ఉన్నాయి. మంచినీళ్ల ప్రాయంలా సెంచరీలు బాదిన కోహ్లీ కాస్త నెమ్మదించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వాటన్నింటికీ గురువారం ఆఫ్ఘాన్తో మ్యాచ్తో ఫుల్స్టాప్ పెట్టాడు. తిట్టిన నోళ్లతోనే పొగడ్తలు వచ్చేలా చేశాడు. తన 71వ సెంచరీతో విరాట్ కోహ్లీ ఏకండా 12 రికార్డులను బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ శివాలెత్తి ఆడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచానికి చూపించాడు. పైగా సిక్సర్తో తన సెంచరీని పూర్తి చేసుకుని అభిమానులకు ఒక రేంజ్లో ట్రీట్ ఇచ్చాడు. మరి 71వ సెంచరీతో కోహ్లీ సాధించిన రికార్డులు ఇప్పుడు తెలుసుకుందాం.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రోహిత్ శర్మ 118 రికార్డును కోహ్లీ తన సెంచరీ(122 నాటౌట్)తో బద్దలుకొట్టాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ చేసిన భారత నాలుగో క్రికెటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో సెంచరీ చేసిన భారత ఆరో బ్యాటర్ కోహ్లీనే. 71 సెంచరీలతో ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి ముందు సచిన్ 100 సెంచరీలతో నంబర్ వన్గా ఉన్నాడు. టీ20ల్లో 100 సిక్సులు కొట్టిన రెండో భారత బ్యాటర్ కోహ్లీనే. ప్రపంచ వ్యాప్తంగా 10వ క్రికెటర్ కోహ్లీ కొట్టిన 122 పరుగులే యూఏఈలో అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోర్ టీ20ల్లో 3,500 పరుగుల మార్క్ను దాటిన రెండు ఆటగాడు కోహ్లీనే. ఈ సెంచరీతో కోహ్లీ 24,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ మార్క్ దాటిన 7వ ఆటగాడిగా నిలిచాడు. సచిన్, ద్రవిడ్ తర్వాత 24,000 పరుగులు చేసిన మూడో భారత్ క్రికెటర్ కోహ్లీనే. కేవలం 522 ఇన్నింగ్స్ల్లో అత్యంత వేగంగా 24,000 పరుగులు పూర్తి చేసి, 540 ఇన్నింగ్స్లో 24వేల పరుగులు చేసిన సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసిన ఏకైన ఆటగాడు కోహ్లీనే. ఈ సెంచరీతో కోహ్లీకి 13వ మ్యాచ్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డుల జాబితాలో నబితో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.