"పెళ్ళైతే ఇక మహిళల జీవితం అయిపోయినట్టే. ఏమైనా కలలు కనాలనుకుంటే పెళ్ళికి ముందే కనేయండి. ఎందుకంటే పెళ్లయ్యాక ఆ పప్పులేమీ ఉడకవు. భర్తే ప్రపంచం, సర్వస్వం. ఇంటిని చూసుకోవడం కంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది? నాలుగు గోడల మధ్య నలిగిపోవాల్సిందే" అని ఆటవిక సమాజం ఎప్పుడూ కలలు కనే ఆడపిల్లల్ని చిదిమేస్తుంటుంది. నాలుగు గోడల మధ్య తన కల చెరిగిపోకూడదని, తన కలని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కంకణం కట్టుకున్నదో వివాహిత. గరిటె పట్టుకోవాల్సిన చేత్తో డంబుల్స్ పట్టుకుంది. కట్ చేస్తే ఇవాళ రాజస్థాన్ లో మొట్టమొదటి మహిళా బాడీ బిల్డర్ అయ్యింది. ఐదో తరగతిలో చదువు ఆగిపోయింది. ఎనిమిదేళ్ల వయసులో పెళ్లయిపోయింది. గొర్రెలు కాసుకునే స్థితి నుండి బాడీ బిల్డర్ అయ్యింది. ఆమె ఎవరు? ఆమె కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. ఆమె పేరు ప్రియా సింగ్. రాజస్థాన్ కు చెందిన మొట్ట మొదటి మహిళా బాడీ బిల్డర్. బికనేర్ జిల్లాలో చిన్న గ్రామం. అయిదవ తరగతి వరకూ చదువుకుంది. ఎనిమిదేళ్ల వయసులో పెళ్లయిపోయింది. కానీ మేజర్ అయ్యే వరకూ పుట్టింట్లోనే ఉండాలన్నారు. మేలి ముసుగులో గొర్రెలు కాయడం, కట్టెలు కొట్టడం, ఇంటి పని చేసుకోవడం తప్ప వేరే లోకం లేదు. ఈ లోకంలోనే ఉంటే తమ బతుకులు కాలిపోతాయని ఆమె భావించింది. కుటుంబం కోసం మగాడిగా మారింది. ఆర్ధిక సమస్యల కారణంగా తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు, అదే సమయంలో తన కలని నెరవేర్చుకునేందుకు జిమ్ ట్రైనర్ అవతారం ఎత్తింది ప్రియా సింగ్. ఉన్న ఊరు నుంచి జైపూర్ కి బయలుదేరింది. ఓ జిమ్ సెంటర్ లో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమె హైట్, పర్సనాలిటీ వల్ల సెలెక్ట్ అయ్యింది. ట్రైనర్ గా ఉద్యోగంలో చేరింది. ట్రైనర్ అయిన అతి తక్కువ సమయంలోనే అన్ని ఎక్సర్సైజులు నేర్చుకుంది. జిమ్ లో అందరూ తనని పహిల్వాన్ అనేవారు. మగాళ్లు సైతం ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకున్న ప్రియా సింగ్ కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఈమె వాటన్నిటినీ ఎదిరించి నిలబడింది. "మహిళలు బాడీ బిల్డింగ్ చేయడం చాలా కష్టం. మగాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ వర్కవుట్లు చేయాలి. మగాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే మహిళలు బాడీ బిల్డర్లు అవ్వచ్చు" అంటూ ఆమె సలహా ఇస్తుంది. నీకెందుకు బాడీ బిల్డింగు, ఇల్లు చక్కబెట్టుకో, పిల్లల్ని చూసుకో అంటూ ఆమెను ఎంతోమంది నిరుత్సాహపరిచారు. కొంతమంది మగరాయుడు అన్నారు, బికినీ వేసుకోవడానికి సిగ్గు లేదా అని తిట్టారు. ఆమెకు వ్యతిరేకంగా వేల కామెంట్స్ వచ్చాయి. అది తెలిసి ఆమె అన్నయ్య చంపేస్తా అని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె భయపడలేదు. సమాజం చిన్న చూపు చూసినా గానీ తల్లిదండ్రులు, భర్త, పిల్లలు ఈమెకు అండగా నిలబడ్డారు. వంట గదిలోకి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడని ప్రియా సింగ్, తాను కన్న కలని నిజం చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. మూడు సార్లు మిస్ రాజస్థాన్ టైటిల్స్, పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. బాడీ బిల్డింగ్ లోకి వచ్చాక వంట గదిలోకి వెళ్లడమే మానేసిందట. టిఫిన్ కావాలంటే ఆమె కూతురే తీసుకొచ్చి ఇస్తుందట. ఈరోజు ఆమె ఇలా బాడీ బిల్డర్ గా ఉండడానికి కారణం తన కూతురే అని గర్వంగా చెప్పుకుంటుంది. జిమ్ లో ఉన్నంత సేపే తాను ట్రైనర్ గా ఉంటానని, ఇంటికెళ్తే ఆ తాలూకు వాసన ఉండదని ఆమె చెబుతోంది. డంబుల్స్ పట్టుకున్న చేతికి గాజులు, నుదిట బొట్టు, సాంప్రదాయాన్ని తలదన్నేలా కట్టు అన్నీ పాటిస్తానని ఆమె చెబుతుంది. అమ్మాయిలు కూడా తనలా దృఢంగా ఉండాలని ఆమె చెబుతోంది. "ఏదైనా పని చేసే ముందు మెదడు, మనసుతో రెండింటితో ఆలోచించండి. మంచి పని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేసేయండి. సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండండి" అంటూ ఆమె యువతకి సలహా ఇస్తోంది. ఒకరి ఎదుగుదలకు ఊరు అడ్డుపడుతుందంటే, ఆ ఒకరే రేపు అలాంటి ఊర్లున్న రాష్ట్రానికో, దేశానికో ఆదర్శంగా నిలిచేంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అనడానికి ప్రియా సింగే నిదర్శనం. మరి ఎన్నో అవమానాలను దాటుకుని అందరి అభిమానం సొంతం చేసుకున్న రాజస్థాన్ బాడీ బిల్డర్ ప్రియా సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనిమిదేళ్ల వయసులో పెళ్లవడంతో మేలి ముసుగులోనే గొర్రెలు కాసిన ప్రియా సింగ్.. రాజస్థాన్లో మొదటి మహిళా బాడీ బిల్డర్ ఎలా అయ్యారు?#Rajasthan #WomenPower #LadyBodybuilder pic.twitter.com/BrvJklL9kb — BBC News Telugu (@bbcnewstelugu) July 12, 2022