ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఆటగాళ్లతో పాటు రెండు దేశాల క్రికెట్ అభిమానులు సైతం తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తమ దేశం గెలిస్తే ఎంత హంగామా చేస్తారో.. ఓడితే అంతకుమించి ట్రోల్ చేస్తారు. రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది టీ20 వరల్డ్ కప్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లు అయింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు భారత్పై ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పాక్ క్రికెటర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాక్ మాజీలు సైతం మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు చేసిన తప్పులపై ఏకిపారేస్తున్నారు. అదే విధంగా ఇండియాతో మ్యాచ్లో ఓటమిని పాకిస్థాన్ క్రికెటర్లు సైతం అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు. అందులోనూ యువ క్రికెటర్లు అయితే తట్టుకోవడం మరీ కష్టం. తాజాగా ఇదే పరిస్థితి పాక్ యువ పేసర్ నసీమ్ షాకు వచ్చింది. ఆసియా కప్లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన నసీమ్ షా.. తొలి ఓవర్ రెండో బంతికే ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను అవుట్ చేసి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. తన అద్భుతమైన బౌలింగ్తో టీమిండియా బ్యాటింగ్ లైనప్ను వణికించాడు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను సైతం కీలక సమయంలో బౌల్డ్ చేసి పాకిస్థాన్కు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఒక డెబ్యూ బౌలర్ ఈవిధంగా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతనిపై అంతా ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్ ఓడిపోయినప్పటికీ కూడా నసీమ్ షాను అంతా మెచ్చుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు సైతం నసీమ్ షా అద్భుతంగా పోరాటం చేశాడంటూ కితాబిచ్చారు. కానీ.. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినా.. భారత్పై తన టీమ్ ఓటమి పాలవడంతో నసీమ్ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠతో సాగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్స్ బాది మ్యాచ్ ముగించిన తర్వాత.. నసీమ్ షా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు అతన్ని ఓదార్చారు. నసీమ్ తన తొలి మ్యాచ్లోనే టీమిండియాతో ఆడటం.. అందులోనూ మంచి ప్రదర్శన కనబర్చినా.. మ్యాచ్ ఓడిపోవడంతో తట్టుకోలేకపోయాడు. గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్రూమ్కు వెళ్లేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నసీమ్ షా కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘మ్యాచ్లో గెలుపోటములు సహజం.. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించిన నసీమ్ ముందు ముందు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని రాటుదేలాలి’ అంటూ నెటిజన్లు అతని ధైర్యం చెప్తున్నారు. ‘పాకిస్థాన్ మ్యాచ్ ఓడినా నువ్వు మాత్రం మా హృదయాలను గెలుచుకున్నావ్’ అంటూ అతనికి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం నసీమ్ షా వయసు కేవలం 19 ఏళ్లు మాత్రం. మరి నసీమ్ షా కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాక్ క్రికెటర్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ Naseem Shah going out after his final over. pic.twitter.com/2FMfG2MjAf — Taimoor Zaman (@taimoorze) August 29, 2022