ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా యాక్టీవ్గా ఉంటారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లినప్పుడు.. 2019 ఎన్నికల ప్రచారంలో షర్మిల తన అన్న కోసం ఎంత శ్రమించిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. షర్మిలకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలాంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోలేదు. ఆ తర్వత కొన్నాళ్లకు షర్మిల అనూహ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టి.. ఇక్కడ రాజకీయాల్లో క్రియశీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నతో పడక పార్టీ పెట్టానని షర్మిల చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. అన్నతో పడకపోతే.. ఏపీలో పార్టీ పెట్టి.. అక్కడే పోరాటం చేయాలి కానీ.. తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటనే అనుమానాలు నేటికి జనాల్లో అలానే ఉన్నాయి. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఓ వ్యూహం, ఎత్తుగడ ప్రకారమే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని.. కేసీఆర్కు మేలు చేయడం కోసమే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. జగన్ మద్దతుతోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని ఇప్పటికి చాలా మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు షర్మిల ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. దాంతో అందరూ షర్మిలకు జగన్ మద్దతు ఉందని నమ్మడం ప్రాంరభించారు. అయితే ఇలాంటి ప్రచారంతో తనకు ప్రమాదం అని భావించిందో ఏమో కానీ.. సడెన్గా షర్మిల తన పంథా మార్చింది. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి.. జగన్ని టార్గెట్ చేసి.. అన్న మీద అటాక్ చేసింది షర్మిల. ఆ వివరాలు.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరద బాధితులను పరమార్శించడానికి వెళ్లిన కేసీఆర్.. భారీ వరదల వెనక విదేశాల కుట్ర ఉందని కామెంట్స్ చేయగా.. మంత్రి పువ్వాడ అజయ్ ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వల్లే వరద వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రి మాటలకు కౌంటర్ ఇస్తూ.. పనిలో పనిగా.. తన అన్న, ఏపీ సీఎం జగన్ మీద కూడా విమర్శలు చేసింది షర్మిల. భద్రాచలానికి గోదావరి వరద వచ్చిందంటే దానికి ముమ్మాటికీ సీఎం కేసీఆరే కారణమని ఆరోపించింది షర్మిల. భద్రాచలానికి కరకట్ట లేదని.. అందువల్లే.. ఈ పరిస్థితి అని తెలిపింది. అలానే పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల విరుచుకుపడింది. పోలవరమే సమస్య అయితే, అది మీకు ముందు కనిపించలేదా.. ముందే ఎందుకు మాట్లాడలేదని నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు బాగుందని గతంలో ఎందుకు మెచ్చుకున్నారని ప్రశ్నించింది. ఆ ముఖ్యమంత్రి (వైఎస్ జగన్)తో మీరు దోస్తీ చేసినప్పుడు, ఇంటికి పిలిపించుకున్నప్పుడు, స్వీట్లు తినిపించుకున్నప్పుడు, కౌగిలించుకున్నప్పుడు ఎందుకు మాట్లాడుకోలేదని ఎద్దేవా చేసింది షర్మిల. తీరా ఇప్పుడు వరద ముంపు వచ్చిన తర్వాత ఆ నెపాన్ని కప్పి పుచ్చుకోడానికి, తప్పించుకోడానికి సాకులు చెబుతున్నారని కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మీరు, మీరు (కేసీఆర్, జగన్) కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదని షర్మిల నిలదీశారు. మీరు మీరు ఫ్రెండ్స్, కౌగిలించుకుంటారు, అన్నీ చేసుకుంటారని, మరి పోలవరం వల్ల సమస్య గురించి ఎందుకు మాట్లాడుకోలేదని నిలదీసింది షర్మిల. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించింది. తప్పించుకోకపోవడానికి కాకపోతే ఇదేంటని షర్మిల నిలదీసింది. కేసీఆర్, మంత్రికి కౌంటర్ ఇస్తూనే.. ఇలా మొదటి సారి షర్మిల తన అన్నను కూడా తెలంగాణ రాజకీయాల్లోకి లాగింది. కేసీఆర్తో జగన్ స్నేహాన్ని ప్రస్తావిస్తూ, టీఆర్ఎస్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల ప్రయత్నించింది. తెలంగాణలో షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాను మాత్రం వైఎస్సార్సీపీ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించాలి అని అనుకుందో ఏమో తెలియదు కానీ.. తొలిసారి అన్నని టార్గెట్ చేసి.. తెలంగాణ రాజకీయాల్లోకి లాగి.. కేసీఆర్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది షర్మిల. అందుకే మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగానే ఆంధ్రా సీఎంతో కేసీఆర్ స్నేహం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చారనే రీతిలో షర్మిల ఘాటు విమర్శలు చేసింది. రానున్న రోజుల్లో కేసీఆర్తో జగనన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ, రాజకీయంగా లబ్ధి పొందేందుకు షర్మిల ఏ మాత్రం వెనుకాడరనేందుకు ఈ ప్రెస్మీటే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి షర్మిల ఈ దూకుడును ఇలానే కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: రాష్ట్రాల అప్పులు ప్రకటించిన కేంద్రం! జగన్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టేనా? ఇది కూడా చదవండి: KCRలా.. వైఎస్ ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదు.. షర్మిల కామెంట్స్ వైరల్!