ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీతారామం చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిని ఏపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరచర్చ నడుస్తోంది. అశ్వినీదత్ వంటి బడా నిర్మాత ఏకంగా ప్రభుత్వంతో ఢీకొట్టడం ఏంటి.. సీఎం జగన్నే టార్గెట్ చేస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి.. అసలు అశ్వినీదత్ నిజంగానే తిరుపతి మీద ప్రేమతో ఈ వ్యాఖ్యలు చేశాడా.. లేక ఆయన స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేశాడా అనే విషయంపై ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అశ్వినీదత్ వ్యాఖ్యల వెనక పెద్ద కారణాలే ఉన్నాయంటూ కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై అశ్వినీదత్ ఇంతలా కోపం ప్రదర్శించడానికి కారణం ఓ భూ వివాదం అంటున్నారు విశ్లేషకులు. గన్నవరం విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అశ్వినీదత్కు 40 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు హయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ చేపట్టారు. ఆ భూమిని గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ చర్య అశ్వినీదత్కు భారీగా నష్టం కలిగించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చకపోతే తాను నష్టపోతానని అశ్వినీదత్ ఆవేదన. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ప్రభుత్వ చర్య వల్ల తాను నష్టపోతానని, రూ. 210 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కారు. విమానాశ్రయానికి ఇచ్చిన మొత్తం భూమి విలువకు ఇపుడు నాలుగురెట్లు చెల్లించాలని కోర్టులో కేసు వేయడం సంచలనం రేకెత్తించింది. అంతేకాదు, రూ. 210 కోట్ల పరిహారంతో పాటు ల్యాండ్ రెంటును కూడా చెల్లించాలని అశ్వినీదత్ కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ చర్యలతో అశ్వినీదత్కు ఆర్థికంగా భారీ నష్టం కలగనుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల వైఖరి కనిపించపోవడంతో.. అశ్వినీదత్ జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాడు. అందుకే ఇలా అవకాశం దొరకగానే తన అక్కసును వెళ్లగక్కాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: YS Jagan: ఆ ఐదుగురిని టార్గెట్ చేసిన CM జగన్.. వారి ఓటమే తన లక్ష్యమా! ఇది కూడా చదవండి: APలో అవినీతి నిర్మూలనకు ‘కాల్ 14400’ సర్వీస్! విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం జగన్!