ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు నెలవారిగా జీతాలు ఇచ్చేవారని తెలుసా మీకు. అవును అప్పుడంటే సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తున్నారు గానీ, గతంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్.. ఇలా అందరికి నెలవారిగా సాలరీ ఇచ్చేవారు. ఇక ఇప్పుడైతే చెప్పనేకూడదు. ఎందుకంటే భారత్ లో హీరోల రెమ్యునరేషన్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు హీరోలు, హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు దర్శక, నిర్మాతలు. హీరో, హీరోయిన్ల రెమ్మ్యూనరేషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అడిగినంత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా కోసం మెగా పవర్ స్టార్ భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ సినిమా చేయబోతున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ ఏకంగా 80 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని సమాచారం. రామ్ చరణ్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దిల్ రాజు సిద్దమయ్యారట. ఇక పాన్ ఇండియా సినిమాకు మొత్తంగా 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందనుందట. అన్నట్లు ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.