చదువుకు వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా.. ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. ఇక చాలామందికి యుక్త వయసులో ఉండగా చదువుకోవడానికి కుదరదు. ఇప్పుడంటే పరిస్థితులు మారాయి.. కానీ.. ఒకప్పుడు.. చదువు కన్నా కూడా పని చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. బడికెళ్లాల్సిన వయసులో పనికెళ్లాల్సి వచ్చేది. చాలా మందికి చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికి అది తీరకుండానే.. జీవితంలో ముందుకు సాగాల్సి వచ్చేది. అలాంటి వారు వృద్ధాప్యంలోనో.. లేక బాధ్యతలు తీరిన తర్వాత చదవుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యుక్తవయసులో చదవడానికి అవకాశం దొరకలేదు. కానీ చదువుకోవాలనే ఆశ మాత్రం అలానే ఉంది. దాంతో కుమారుడితో పాటు పదో తరగతి పరీక్షకు ఫీజు కట్టాడు. ఇక ఫలితాలు వచ్చిన రోజు షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కారణం తండ్రి పరీక్షలో పాస్ అయ్యాడు.. కుమారుడు ఫెయిల్ అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పూణెకు చెందిన భాస్కర్ వాగ్మారే (43), అతని కొడుకు కలసి ఈ సంవత్సరం 10వ తరగతి మహారాష్ట్ర బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అయితే ఆ పరీక్షల్లో తండ్రి భాస్కర్ పాస్ అయ్యారు. కానీ కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఆ కుటుంబ సభ్యులు గందరగోళంలో పడ్డారు. నిజానికి భాస్కర్ తన కుటుంబ పోషణ కోసం ఏడో తరగతిలోనే చదువు ఆపేసి.. పనికి వెళ్లాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు తను మళ్లీ చదువును కొనసాగించాలని భావించాడు. 30 ఏళ్ల విరామం తర్వాత కొడుకుతో కలిసి ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యాడు. కానీ ఇప్పుడు ఈ విధమైన ట్విస్ట్ వచ్చింది. భాస్కర్ ప్రస్తుతం పూణె నగరంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ డయాస్ ప్లాట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు, జీవనోపాధి కోసం పనిలో చేరడంతో అది సాధ్యం కాలేదు" అని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు చదువును కొనసాగించాలనుకున్నానని ఆయన అన్నారు. తన కొడుకు కూడా ఈ ఏడాదే పదో తరగతి పరీక్షలు రాశాడని, అది తనకు కొంత ఉపయోగపడిందని చెప్పారు. అలాగే "ఇప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషిస్తున్నా.. అయితే నా కొడుకు రెండు పేపర్లలో ఫెయిలయ్యాడని బాధగా ఉంది." అన్నాడు భాస్కర్. అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసి.. వాటిని క్లియర్ చేస్తాడని భాస్కర్ అన్నారు. దీనిపై అతని కుమారుడు సాహిల్ కూడా దీనిపై స్పందించాడు. "మా నాన్న పాస్ అయినందుకు సంతోషంగా ఉంది. కానీ నేను కూడా వదులుకోను. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతాను. పేపర్లు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను." అని సాహిల్ అన్నాడు. కాగా మహారాష్ట్రలో శుక్రవారం ప్రకటించిన ఫలితాల ప్రకారం ఉత్తీర్ణత శాతం 96.94గా ఉంది. కొంకణ్ డివిజన్ 99.27 ఉత్తీర్ణత సాధించి ఫస్ట్లో ఉండగా.. నాసిక్ డివిజన్ 95.90 శాతంతో లాస్ట్లో ఉంది. అయితే ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థులకు అదనంగా 30 నిమిషాలు టైం ఇచ్చారు. వారి సౌకర్యార్థం, వారి సొంత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా అనుమతించారు.